తరగని క్యూలు..
డీజీల్ అందుబాటులో లేకపోవడంతో విజయవాడ గాంధీనగర్ ప్రాంతంలో
రోడ్డు పక్కన నిలిచిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇంధన సంక్షోభం రైతులు, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. పెట్రోల్ అందుబాటులోకి వచ్చినా డీజిల్ కొరత ఇంకా వేధిస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు బస్సులు, కారు ట్రావెల్స్ నిర్వాహకులకు డీజిల్ షాక్ తగిలింది. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు కొన్ని బంకుల వద్ద క్యూ కట్టి దర్శనమిచ్చాయి. అక్కడక్కడ కొన్ని బంకులు తెరుచుకోలేదు. కొన్ని బంకుల యాజమాన్యం లోడ్ రావాల్సి ఉందని, ఈ నేపథ్యంలోనే మూసివేశామని వాహనదారులకు సమాధానమిస్తున్నారు. రెండు రోజులుగా వాహనాదారులు బంక్ల వద్ద ఇబ్బందులు పడుతూ వచ్చారు. పోలీసు, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడంతో రద్దీ తగ్గింది.
రైతుల కష్టాలు తీరేదెలా?
గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోని కొన్ని మండలాల్లో 20, 30 గ్రామాలకు ఒకటి రెండు పెట్రోల్ బంకులే అందుబాటులో ఉన్నాయి. అటువంటి చోట రైతులు అసౌకర్యానికి గురయ్యారు. ట్రాక్టర్లు, వరి, మొక్కజొన్న కోసే యంత్రాలు పొలాల్లో ఉంటే సహాయకులు బైక్లపై క్యాన్లతో డీజిల్ అందిస్తూ ఉంటారు. దగ్గర్లో బంకులు లేక పోవడం... ఇవాళ కూడా కొన్ని బంకులు పరిమితులు విధించడంతో రైతుల అవసరాలకు సరిపడా అందలేదని చెబుతున్నారు. ఇక ఆటో వాలాలు దూర ప్రాంత కిరాయిలు రద్దు చేసుకున్నారు. రూ. 200, రూ. 300కే డీజిల్ పోశారని చెబుతున్నారు.
ట్రావెల్స్ బస్సుల క్యూ..
నగరంలో హనుమాన్పేట ప్రైవేటు ట్రావెల్స్కు అడ్డా. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులతో ఉదయాన్నే బస్సులు నగరానికి చేరుకుంటాయి. సాయంత్రం ప్రయాణికులతో తిరుగు ప్రయాణం అవుతాయి. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు డీజిల్ కోసం క్యూ కట్టాయి. రాత్రిళ్లు వందల కిలో మీటర్లు ప్రయాణం చేసి వచ్చామని, పగలు నిద్ర పోకుండా డీజిల్ కోసం క్యూలో బస్సులు నిలుపుకోవాల్సి వచ్చిందని డ్రైవర్లు వాపోయారు. జిల్లాలో పలు చోట్ల బంకులు మూసి ఉంచారు. వాహనదారులు అడిగితే లోడ్కు డబ్బులు కట్టామని, లోడ్ వచ్చే వరకు పెట్రోల్, డీజిల్ పోయలేమని సమాధానం చెబుతున్నారు. ఆయా బంకుల్లో పనులు లేక పోవడంతో సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు.
ధర పెంచిన ప్రైవేటు బంక్లు..
జిల్లాలో ప్రైవేటు బంకులు ధరలు పెంచేశాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.109.21 ఉండగా డీజిల్ రూ.97.07గా ఉంది. ప్రైవేటు బంకుల్లో లీటర్కు రూ.5 చొప్పున పెంచేశారు. ప్రైవేటు బంకుల్లో పెట్రోల్ రూ. 114.19కు చేరింది.
ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లపై పెట్రో కష్టాలు మరింత ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులను ఆదుకోవాలి.. ఆటో కార్మికులు ఇబ్బంది పడకుండా డీజిల్, పెట్రోల్ ప్రత్యేకంగా అందించేలా చర్యలు తీసుకోవాలి.
– డి. నాయుడు
ఆటో డ్రైవర్
అసలే ర్యాపిడో, ఓలా, ఊబర్ లతో పాటు ఫ్రీ బస్సుల వల్ల ఆటో కిరాయిలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఆటోకు అవసరమైన డీజిల్ కోసం పెట్రోల్ బంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎక్కడ డీజిల్ దొరుకుతుందో ఎక్కడ ఉండదో అర్థం కావటం లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కేవలం రూ. 200 డీజిల్ మాత్రమే పోస్తున్నారు. దీనివల్ల ఉన్న బేరాలను కూడా వదులు కోవాల్సి వస్తోంది.
– ఆర్. కృష్ణ, ఆటో డ్రైవర్
కుదేలవుతున్న రవాణా వ్యవస్థ
ఆయిల్ లోడ్ రాకపోవడంతో
తెరుచుకోని బంక్లు
బారులు తీరిన ట్రావెల్స్ బస్సులు
గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు,
ఆటోలు, కార్లకు పరిమితులు


