వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

Apr 29 2026 8:36 AM | Updated on Apr 29 2026 8:36 AM

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు డిస్ట్రిక్స్‌ స్పోర్ట్స్‌ అథారిటీ, డిస్ట్రిక్ట్‌ యూత్‌ వెల్ఫేర్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిచే వేసవి శిక్షణ శిబిరాలను ఎన్టీఆర్‌ జిల్లాలోని బాల బాలికలు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్‌డీఓ కె.కోటేశ్వరరావు సూచించారు. స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియం ఆవరణ లోని డీఎస్‌డీఓ కార్యాలయంలో ఆయన మంగ ళవారం విలేకరులతో మాట్లాడారు. ఇందిరాగాంధీ స్టేడియంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొత్తం 50 శిబిరాలు నిర్వహిస్తామన్నారు. 27 క్రీడల్లో శిక్షణ ఇస్తామని వివరించారు. ఎనిమిది నుంచి 16 ఏళ్లలోపు బాలబాలికలు శిక్షణ శిబివరాలను సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. జిల్లా యూత్‌ వేల్ఫేర్‌ ఆఫీసర్‌ కె.రమేష్‌ పాల్గొన్నారు.

అవసరాలకు అందుబాటులో ఇంధనం

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో వినియోగదారుల అవసరాలకు సరిపడా ఇంధనం అందుబాటులో ఉందని కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. జిల్లాకు నిత్యం ఎనిమిది లక్షల లీటర్ల డీజిల్‌, ఆరు లక్షల లీటర్ల పెట్రోల్‌ సరఫరా అవుతోందన్నారు. పెట్రోల్‌ డీజిల్‌ సరఫరాపై కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లో మంగళవారం ఉదయం కలెక్టర్‌ లక్ష్మీశ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిడమానూరు, ఎనికేపాడు, రామవరప్పాడులోని బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు, సరఫరా వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లా డుతూ.. ఇంధన సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఇంధన సరఫరాపై ఎలాంటి సమస్యలు ఎదురైనా కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 91549 70454లో సంప్రదించాలని కోరారు. ఆయిల్‌ బంకుల పర్యవేక్షణలో కలెక్టర్‌ వెంట విజయవాడ రూరల్‌ తహసీల్దార్‌ బి.సుగుణ, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన

ఏర్పాట్ల పరిశీలన

గుడ్లవల్లేరు: మండల కేంద్రమైన గుడ్లవల్లేరులో మే ఒకటో తేదీన ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పర్యటిస్తారని, పకడ్బందీ ఏర్పాట్ల చేయాలని అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ ఆదేశించారు. ఆయన మంగళవారం గుడ్లవల్లేరులో పర్యటించారు. ఫార్మా కంపెనీ అధినేత జాస్తి వెంకట్‌ రూ.15 కోట్లతో నిర్మించిన ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థను సీఎం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ బాలాజీతో పాటు ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాలలో హెలీప్యాడ్‌ నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం ఎల్వీ ప్రసాద్‌ వైద్య విజ్ఞాన సంస్థ భవనాన్ని సందర్శించారు. గుడివాడ ఇన్‌చార్జి ఆర్డీఓ పోతురాజు, విజిలెన్స్‌ డెప్యూటీ కలెక్టర్‌ పోతురాజు, మచిలీపట్నం ఆర్డీఓ సాంబశివరావు, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, బీసీ సంక్షేమ సాధికారత అధికారి రమేష్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోండి

పెడన: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 30వ తేదీన పెడనలోని శ్రీబొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగే జాబ్‌మేళాను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‌ మేళాకు నిరుద్యోగులు నేరుగా ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావొచ్చని పేర్కొన్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొని 720కు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి నరేష్‌ కుమార్‌ తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌ పూర్తిచేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు యువత అర్హులని పేర్కొన్నారు. అసక్తి, తగిన అర్హతలు గల వారు హెచ్‌టీటీపీ ఎస్‌://ఎన్‌ఏఐపీయూఎన్‌వైఎఎం.ఏపీ.జీఓవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99664 89796, 8897 772488 సెల్‌ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement