చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమ వారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్తో పాటు డీఆర్వో చంద్రశేఖరరావు, మెప్మా పీడీ సాయిబాబు, అసిస్టెంట్ కలెక్టర్ నమ్రత అగర్వాల్, డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజల నుంచి 104 అర్జీలు అందాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. మే ఒకటో తేదీన పమిడిముక్కల మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తారని తెలిపారు. పింఛన్లు పంపిణీ చేసి లబ్ధిదారులతో మాట్లాడతారని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలంలో డాక్టర్ ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రిని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వివరించారు. సీఎం పర్యటనల ఏర్పాట్లకు ఉయ్యూరు, గుడివాడ ఆర్డీఓలు ఇన్చార్జ్ అధికారులుగా వ్యవహరించాలని ఆదేశించారు. పింఛన్ల లబ్ధిదారులతో ముఖాముఖీ ఏర్పాట్లను డీఆర్డీఏ పీడీ, డ్వామా పీడీ పర్యవేక్షించాలని సూచించారు.


