రెడ్డిగూడెం: ఎన్టీఆర్ జిల్లాలో జలధార – జలహారతిలో భాగంగా చెరువులు, కాలువల్లో పూడికతీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచి భూగర్భ జలాలను పరిరక్షిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేటలో ఊర చెరువు సప్లయ్ చానల్ పూడిక తీత పనులను కలెక్టర్ లక్ష్మీశ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 339 చెరువులు ఉన్నాయని, వాటిలో నీటినిల్వ సామర్థ్యం, భూగర్భ జలాలు పెంచటానికి జలధార – జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. జిల్లాలో మినీ రిజర్వాయర్లు, డ్యాముల్లో పది టీఎంసీల సామర్థ్యం నీటిని నింపుతామన్నారు. జిల్లాలో ఎ.కొండూరు, రెడ్డిగూడెం మండలాల్లో భూగర్భ జలాలు ఎనిమిది నుంచి 11 మీటర్ల లోతున ఉన్నాయని, వాటిని పెంచుకునేందుకు చర్యలు చేపట్టా మని పేర్కొన్నారు. జలధార – జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాను సశ్యశ్యామలం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.రాము, అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ పార్థసారథి, తహసీల్దార్ జె.సుశీలాదేవి, రెడ్డిగూడెం ఎంపీడీఓ జె.ప్రభాకరరావు, ఇరిగేషన్ డీఈఈ, ఏఈలు, ఏపీఓ సిబ్బంది పాల్గొన్నారు.


