గూడూరు: మండలంలోని రామానుజవత్తర్లపల్లిలో మహావిష్ణుమూర్తి ఆకారంలో ఉన్న శిలా విగ్రహం బయటపడింది. గ్రామంలోని చెరువులో మట్టిని స్థానిక రైతు మట్టా లక్ష్మీనారాయణ తన ఇంటి మెరక చేసుకోవడానికి తోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మట్టిని చదును చేస్తుండగా విగ్రహం బయట పడింది. విగ్రహం నల్లని రంగులో దాదాపు 3 అడుగుల ఎత్తు, 2.5 అడుగుల వెడల్పుతో ఉంది. విషయం గ్రామస్తులకు తెలియడంతో జనం వచ్చి విగ్రహానికి పూజలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సోమవారం గ్రామానికి వచ్చారు. తహసీల్దార్ డి.రాజ్యలక్ష్మి, ఆర్ఐ ఝాన్సీ రాణి, వీఆర్వో బషీర్ విగ్రహాన్ని పరిశీలించి, గ్రామస్తుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచారు. పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. పూర్వం దశాబ్దాల క్రితం కూడా గ్రామంలో ఇదే మాదిరిగా చెరువు తవ్వకాలలో వేణుగోపాల స్వామి విగ్రహం బయట పడటం విశేషం.


