ఎన్టీఆర్ జిల్లా జేసీ ఇలక్కియ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్)తో కచ్చితమైన డేటాతో పాటు అత్యంత పారదర్శకత, సమయం ఆదాకు వీలుంటుందని, ప్రతిఒక్కరూ స్వీయ గణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానం వద్ద జేసీ ఇలక్కియ 5కే రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేశ ప్రగతికి కీలమైన ప్రణాళికలు, విధానాల రూపకల్పనకు దోహదం చేసే జనగణన ప్రక్రియలో భాగంగా ఈ నెల 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఎస్ఈ.సీఈఎన్ఎస్యూఎస్.జీవోవి.ఇన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ వివరాలను పొందుపరుచుకోవచ్చన్నారు.
విశ్వసనీయ డేటా..
సెన్సస్ విభాగం జాయింట్ డైరెక్టర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడం వల్ల విశ్వసనీయ డేటాతో పాటు విస్తృత ప్రజా భాగస్వామ్యానికి, సమయం ఆదాకు దోహదం చేస్తుందన్నారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా సెన్సస్ ఇన్చార్జ్ రమణ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ ఎ.రవీంద్ర, ఆర్డీవో టీవీ సతీష్, జిల్లా యువజన సంక్షేమ అధికారి కొల్లేటి రమేష్, డీ ఎస్డీవో కోటేశ్వరరావు, మెజిస్టీరియల్ సెక్షన్ సూప రింటెండెంట్ ఎం.వెంకటరామయ్య పాల్గొన్నారు.


