పెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో నూతన మార్పులకు అధికారులు శ్రీకారం చుట్టారు. కొంతకాలంగా ఆలయంలో ప్లేట్ కనెక్షన్ పెరగటంతో హుండీల ఆదాయం తగ్గుతోందని అధికారులు భావించారు. దీనిలో భాగంగా ప్లేట్ కనెక్షన్ నియంత్రించటానికి చర్యలు చేపట్టారు. ప్లేట్ లేకుండా ఏక హారతి అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో హుండీల ద్వారా వచ్చే ఆదాయం ఇటీవల లెక్కింపులో 45 రోజులకు రూ.10 లక్షల వరకు పెరిగిందని అధికారులు అంటున్నారు. అయితే కేవలం ప్లేట్ కనెక్షన్ నివారణకు చర్యలు చేపట్టిన అధికారులు బహిరంగ వేలంలో ఆదాయం ఎందుకు తగ్గిందో దానిపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.
తిరుమల మాదిరిగా భక్తులకు దర్శనం..
అమ్మవారి ఆలయంలో తిరుమలలో మాదిరిగా దర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేయటంపై భక్తులు సంతోషం వ్యక్తం వేస్తున్నారు. ఇప్పటి వరకు ఆలయంలో రూ.50 టికెట్, ఉచిత దర్శనం చేసుకునే భక్తులు దూరం నుంచి క్యూలో వచ్చి అంతరాలయంలోని అమ్మవారిని దర్శిచుకుంటూ ముందుకు వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసాలకు వచ్చి అమ్మవారిని కనులారా దర్శించుకునేందుకు సరైన సమయం కూడా దొరికేది కాదు. దీంతో భక్తులు ఎంతో నిరాశకు గురయ్యేవారు. దీనిని గమనించిన అధికారులు తిరుమల తరహాలో అంతరాలయం ఎదురుగా వచ్చి అమ్మవారిని దర్శించుకునేలా క్యూలైన్లో మార్పులు చేశారు. దీనివల్ల భక్తులు క్యూలైన్లో అమ్మదారిని అంతరాలయం వచ్చేంత వరకు ఎక్కువ సేపు అమ్మవారిని చూసే అవకాశం కలిగింది.
ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం..
అమ్మవారి దర్శన టికెట్లు తీసుకునే విధానాన్ని మరింత సులభతరం చేస్తూ దేవస్థాన అధికారులు సెల్ఫ్ సర్వీస్ కియోస్క్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. కరూర్ వైశ్యాబ్యాంక్ వారు 3 కియోస్క్ యంత్రాలను ఆలయానికి అందజేశారు. ఈయంత్రాల సాయంతో క్యూర్ కోడ్ను స్కాన్ చేసి అమ్మవారి దర్శనం టికెట్లుతో పాటు సేవలు, కేశఖండన, ఈ–హుండీ, ఆలయ సమాచారం తెలుసుకోవచ్చు. భక్తులు టికెట్లు కోసం బారులు తీరకుండా సులభంగా ఈయంత్రం సాయంతో టికెట్లు పొందవచ్చు.
ఆదాయం పెంపుపై
దృష్టి పెట్టిన అధికారులు
అమ్మ దర్శనంలో మార్పులు


