మంత్రి రవీంద్ర
కోనేరుసెంటర్: మంగినపూడి బీచ్ను రాష్ట్రంలోనే ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సీఎస్ఆర్ నిధులు రూ. 96.78 లక్షల వ్యయ అంచనాతో మచిలీపట్నం నియోజకవర్గంలోని మంగినపూడి బీచ్ వద్ద మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల కల్పనకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక్కడ పర్యాటకంతో పాటు మత విశ్వాసాలకు సంబంధించిన సంప్రదాయ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుండటంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగిందని చెప్పారు. ఇందులో భాగంగా ఆధునిక మరుగుదొడ్లు, కాఫీ షాప్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏపీఎండీసీ ద్వారా సీఎస్ఆర్ నిధుల కింద ఉపయోగిస్తారన్నారు. డచ్, బ్రిటీష్, పోర్చుగీస్ కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్లు ఉన్న నేపథ్యంలో విదేశీయులు కూడా ఈ ప్రాంతంపై ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ఈ రమణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గుమ్మడి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.


