నేటి ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం జిల్లాలో 21 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 5,634 మంది విద్యార్థులు
మచిలీపట్నంఅర్బన్: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్)–2026ను శనివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మచిలీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, పాలీసెట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎం. జాన్ పీటర్ తెలిపారు. శుక్రవారం ఆయన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 21 పరీక్ష కేంద్రాల్లో 5,634 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారన్నారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని చెప్పారు. అభ్యర్థులు హాల్ టికెట్, పెన్, పెన్సిల్తో ఉదయం 9 గంటలకే తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామన్నారు. అన్ని కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు ఉంటుందని చెప్పారు.
ఏపీఎస్ఆర్టీసీ అదనపు బస్సులు..
అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఏపీఎస్ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. తాగునీరు, పరిశుభ్రత సదుపాయాలు కూడా కల్పించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయడంతో పాటు సెక్షన్ 144 అమలు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణకు వైద్య, సహాయక సిబ్బందిని కేటాయించారు. జిల్లాలోని కేంద్రాలకు 21 మంది ఏఎన్ఎంలు, 21 మంది ఆశా వర్కర్లను నియమించారు.


