ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పశుసంవర్ధక రంగ అభివృద్ధిలో కీలకమైన పశు ఔషధి విక్రయ కేంద్రాలు (పీఏవీకే) వన్ స్టాప్ సెంటర్లుగా సేవలందిస్తాయని, వెటర్నరీ మందులతో పాటు అనుబంధ ఉత్పత్తులు కూడా ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లాస్థాయి ఎంపిక కమిటీ సమావేశం జరిగింది. నందిగామ, తిరువూరు, మైలవరం పశువైద్యశాలల్లో పశు ఔషధి విక్రయ కేంద్రాల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. అర్హత కలిగిన ప్రైమరీ షీప్ బ్రీడర్స్ కోపరేటివ్ సొసైటీ, రైతు ఉత్పత్తి సంఘాలకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లా పశుసంవర్థక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావుతో పాటు సహకార, డ్రగ్ కంట్రోల్, ఆర్అండ్బీ తదితర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ నవీన్
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలోని అన్ని కేడర్ల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు సంబంధించిన సాధారణ సీనియారిటీ జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి సవరించిన జాబితాలను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు, హెచ్ఎంలు తమ వివరాలను సంబంధిత వెబ్సైట్లో పరిశీలించాలని సూచించారు. ఏవైనా అభ్యంతరాలు ఉన్నా, లేదా సస్పెండ్/శాసన చర్యలలో ఉన్నవారు, ఫారిన్ సర్వీసులో ఉన్నవారు లేదా ఇతర కారణాల వల్ల సీనియారిటీ జాబితాలో పేర్లు చేరనివారు సంబంధిత ఆధారాలతో మండల లేక ఉప విద్యాశాఖాధికారి ద్వారా ఈ నెల 28లోపు మచిలీపట్నంలోని డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. నిర్దేశిత గడువు అనంతరం సమర్పించే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని డీఈఓ స్పష్టం చేశారు.


