మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయులు తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని పీఆర్టీయూ ఏపీ జిల్లా అధ్యక్షుడు పెద్దిబోయిన శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పీఆర్టీయూ ఏపీ) ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పెద్దిబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి పీఆ ర్టీయూ ఏపీ దశలవారీ ఉద్యమ కార్యక్రమాలను రూపొందించిందని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 25నవ తేదీన ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపడ్తామని ప్రకటించారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక సర్వీస్ రూల్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నప్పటికీ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హాస్టల్ వెల్ఫేర్ అధికారులను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ ఏపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి జకియా సుల్తానా, జిల్లా కార్యదర్శి మనోహర్, నాయకులు బాబ్జి, మానేపల్లి శ్రీను, ఈశ్వరరావు, హరిచరణ తదితరులు పాల్గొన్నారు.


