మొగల్రాజపురం(విజయవాడతూర్పు): సమాజ సేవ చేయాలనే భావనను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని సిద్ధార్థ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కొల్లి ప్రశాంతి చెప్పారు. నార్త్ సౌత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్స్ను స్థానిక హోటల్లో ఆదివారం అందజేశారు. ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. చదువు కోవడానికి డబ్బు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో నార్త్ సౌత్ ఫౌండేషన్ వారు ప్రతి ఏడాది విద్యార్థులకు ఉపకార వేతనాలను అందచేయడం అభినందనీయమన్నారు. గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పుట్టగుంట సతీష్ మాట్లాడుతూ తోటి వారికి సహాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదని, సహాయం చేసే గుణం ఉంటే చాలని అన్నారు. నార్త్ సౌత్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ చలసాని మల్లిఖార్జునరావు, విజయవాడ చాప్టర్ కో–ఆర్డినేటర్ సూరపనేని వెంకటరత్నం మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లోని 700 మంది విద్యార్థులకు ఒక కోటి 76 లక్షల రూపాయలను విలువైన స్కాలర్షిప్లను అందించామన్నారు. ఈ రోజు 50 మంది విద్యార్థులకు రూ.15 లక్షల విలువైన స్కాలర్షిప్లను అందజేశామని చెప్పారు. ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సత్తారు బాబూరావు, లయన్స్ పాస్ట్ డిస్ట్రీక్ట్ గవర్నర్ కంకణాల శ్రీనివాసరావు, ఆంధ్రా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతబాబు కామినేని, ఆంధ్రా లయోలా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.బాలాజీ భానుతో పాటు స్కాలర్ షిప్ పొందిన విద్యార్థులు పాల్గొన్నారు.


