గుల్లలమోద(నాగాయలంక): మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారుల చేపల వేట నిషేధ కాల భృతి కోసం చేపట్టిన బోట్ల ఎన్యూమరేషన్ కార్యక్రమం అవనిగడ్డ నియోజకవర్గంలోని 11 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో (నాగాయలంకలో 10, కోడూరులో ఒకటి) శనివారం ముమ్మరంగా నిర్వహించారు. వివిధ బృందాలుగా ఏర్పడిన అధికారులు, సిబ్బంది ఉదయం ఏడు గంటల నుంచే నాగాయలంక, ఏటిమొగ, గుల్లలమోద, ఎదురుమొండి, జింకపాలెం, ఏసుపురం, నాచుగుంట, ఈలచెట్లదిబ్బ, సొర్ల గొంది, పాత ఉపకాలి, పాలకాయతిప్ప (కోడూరు మండలం) సెంటర్లలో మొత్తం 1,329 మోటారు బోట్లు, 22 సంప్రదాయ నావల ఎన్యూమరేషన్ పూర్తి చేశారు. గుడివాడ మత్స్యశాఖ ఉప సంచాలకురాలు ఎ.ఉషాకిరణ్ పర్యవేక్షణలో నావల గణన చేశారు. సంబంధిత పూర్తి వివరాల నివేదికలను జిల్లా మత్స్య శాఖ కార్యాలయానికి సమర్పిస్తామని స్థానిక ఎఫ్డీఓ వానపల్లి సత్యనారాయణ చెప్పారు. జిల్లా కార్యాలయం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఎఫ్టీఐ ప్రిన్సిపాల్ వి.రమణరావు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ డి.సోమశేఖర్, ఎఫ్డీఓ నాగభద్రరావు తదితరులు సహకరించారు.
వి.కొత్తపాలెం(కోడూరు): మండల పరిధిలోని వి.కొత్తపాలెం వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కె.చాణక్య శనివారం పట్టుకున్నారు. బియ్యం అక్రమ రవాణా విషయం తెలుసుకున్న వెంటనే సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా వేకనూరుకు చెందిన భోగాది కరుణకుమార్ అశోక్ లేలాండ్ ట్రక్ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని వి.కొత్తపాలెంలోని ఆంజనేయస్వామి గుడివద్ద పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.


