కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ
హనుమాన్జంక్షన్ రూరల్: భూగర్భ జలాల పెరుగుదలలో రైతుల భాగస్వామ్యం ఎంతో కీలకమని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. బాపులపాడు మండలం మడిచర్లలో బుధవారం పర్యటించిన ఆయన గ్రామంలోని చెరువును పరిశీలించారు. గ్రామంలో భూగర్భ జలాల లభ్యత, చెరువుల స్థితిగతులను రైతులను అడిగి తెలుసుకున్నారు. చెరువు ఎఫ్ఎంబీ పరిశీలించిన కలెక్టర్కు స్థానికులు ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు. గతంలో చెరువు విస్తీర్ణం 98 ఎకరాలు ఉండేదని, ఆక్రమణలతో 72 ఎకరాలకు తగ్గిపోయిందని వివరించారు. ఈ చెరువు నిండితే మడిచర్ల, బిళ్లనపల్లి గ్రామాలకు మంచినీటి కొరత ఉండదన్నారు. కలెక్టర్ బాలాజీ స్పందించి తక్షణమే చెరువు ఆక్రమణలు తొలగించాలని, కట్టలను బలోపేతం చేయాలని, ఉపాధి హామీ పనులతో పూడిక తీత చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జెడ్పీ హైస్కూల్ను తనిఖీ చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్థ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. జలవనరుల శాఖ ఎస్ఈ గుణకర్, భూగర్భజల శాఖ డీడీ విజయవర్థన్, ఏడీ బిందు, డ్వామా డీపీ శివశంకర్, తహసీల్దార్ బి.మురళీకృష్ణ, ఎంపీడీఓ జోగేశ్వరరావు, ఎంఈఓలు శ్రీరామ్ బాలాసింగ్, కొమ్మా విజయ్, హెచ్ఎం మైథిలి, సాగునీటి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ దేవినేని సత్యనారాయణ, సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు పుట్టా జగన్మోహనరావు పాల్గొన్నారు.


