పెడన: గుర్రపు డెక్కతో తయారుచేసిన వివిధ రకాల హస్త కళాకృతులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, అందుకు తగ్గట్టుగా అందించడానికి కృషి చేస్తున్నట్లు కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఆయన మంగళవారం పెడన మండలం చేవేండ్ర, బంటుమిల్లి మండలం మణిమేశ్వరం పంచాయతీ లేళ్లగూడెం గ్రామాల్లో పర్యటించారు. సెర్ఫ్, డీఆర్డీఏ, వెలుగు ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు గుర్రపుడెక్కతో వివిధ హస్త కళాకృతుల తయారీలో శిక్షణ ఇస్తున్న నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను పరిశీలించారు.
స్వయం సహాయక సంఘాలకు శిక్షణ..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏడాది క్రితం అసోం నుంచి కళాకారులను జిల్లాకు పిలిపించామని వారు మచిలీపట్నం మండలం చిన్నాపురంలో స్వయం సహాయక సంఘాల మహిళలు 30 మందికి గుర్రపు డెక్కతో వివిధ రకాల బుట్టలు, చాపలు వంటి హస్త కళాకృతులు తయారు చేయడంలో శిక్షణ ఇచ్చారని తెలిపారు. శిక్షణ తీసుకున్న డ్వాక్రా మహిళలు ఉత్పత్తి బాగా చేస్తుండటం గుర్తించామని, తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు అడుగులు వేశామన్నారు. చిన్నాపురంలో శిక్షణ పొందిన వారితో పలు ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇప్పిస్తున్నామని స్పష్టం చేశారు. కేవలం 20 రోజుల్లోనే బుట్టలు చాపలు వంటి అల్లికలు బాగా చేశారని కలెక్టర్ మహిళలను అభినందించారు. అనంతరం కలెక్టర్ లేళ్లగూడెం 9వ తరగతి విద్యార్థులతోనూ, వలంటీర్లతో ముఖాముఖీ మాట్లాడారు. ఈ పర్యటనలో డీఆర్డీఏ పీడీ వై.హరిహరనాథ్, పెడన ఇన్చార్జి తహసీల్దార్ అనిల్ కుమార్, పెడన ఎంపీడీవో అరుణకుమారి, వెలుగు ఏపీఎం శ్రీదేవి, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
కృష్ణా కలెక్టర్ బాలాజీ


