వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం అత్యున్నత ప్రమాణాలతో విద్యార్థులకు మరింత చేరువవుతోందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె. మధుమూర్తి అన్నారు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం 39వ స్నాతకోత్సవం విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆచార్య మధుమూర్తి స్నాతకోపన్యాసం చేశారు. ఇగ్నో 40ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా ఉన్నత విద్యనూ అన్నీ వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచిందన్నారు. జాతీయ స్థూల నమోదు నిష్పత్తినీ పెంపొందించేందుకు కృషి చేస్తూ ‘మీ ఇంటి వద్దకే విద్య’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం 70 మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా డిగ్రీలను ప్రధానం చేశారు. రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె. సుమలత నివేదికను సమర్పిస్తూ దేశవ్యాప్తంగా మూడు లక్షల మందికి పైగా డిగ్రీలను ఈ స్నాతకోత్సవంలో అందుకోనున్నారని చెప్పారు. అలాగే విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో 1,626 మంది విద్యార్థులు డిగ్రీలు తీసుకునేందుకు అర్హత సాధించారన్నారు. ప్రాంతీయ కేంద్రం పరిధిలో పలు నూతన కోర్సులతో పాటు నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో నూతన అధ్యయన కేంద్రాలను రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇగ్నో డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రసాద్బాబు, ఇగ్నో అధికారులు డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ మమత, చెన్ను బాల చందర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఉన్నత విద్యామండలి చైర్మన్
ఆచార్య మధుమూర్తి


