ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ గంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామివార్లు శుక్రవారం కృష్ణానదిలో విహరించారు. దుర్గాఘాట్ సమీపంలోని వీఐపీ స్నానఘాట్ వద్ద ప్రత్యేకంగా అలంకరించిన పడవపై ఆది దంపతుల నది విహారాన్ని ఆలయ అర్చకులు జరిపించారు. తొలుత ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలోని యాగశాల నుంచి శ్రీగంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా వీఐపీ ఘాట్కు తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాట నృత్యాలు, కూచిపూడి కళాకారుల నృత్య ప్రదర్శన మధ్య ఊరేగింపు ముందుకు సాగింది. నవ దుర్గల రూపంలో చిన్నారులు అలరించారు. ఈవో శీనానాయక్ కుటుంబ సమేతంగా, ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇతర ట్రస్ట్ బోర్డు సభ్యులు ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం స్నానఘాట్లో నదీ విహారానికి ఏర్పాటు చేసిన పడవపై ఆది దంపతులను అధిష్టించగా, అర్చకులు పూజలు చేశారు. అనంతరం ముల్లోకాలకు గుర్తుగా నదీలో మూడు పర్యాయాలు విహరించారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తరలించారు. ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఇతర అర్చకులు, వేద పండితులు, ఈఈ ఎల్.రమ, ఇతర ఇంజినీరింగ్ అధికారులు నదీ విహారంలో పాల్గొన్నారు.
ఆది దంపతుల నదీ విహారం


