విజయవాడకల్చరల్: బహుముఖ ప్రతిభాశాలి యల్లా వెంకటేశ్వరరావు అని గజల్ శ్రీనివాస్ అన్నారు. సంగీత సామ్రాట్ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ, సుమధురగాన సధాకర కేవీ బ్రహ్మానందరావు కళాసంస్థ, తెలుగు కళావాహిని ఆధ్యర్యంలో జీవీఆర్ సంగీత కళాశాలలో అంతర్జాతీయ మృదంగ విద్వాంసులు డాక్టర్ యల్లా వెంకటేశ్వరరావుకు స్వర్ణకంకణ, సత్కార కార్యక్రమాన్ని బుధ వారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ మృదంగ విద్యకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన మహానీయుడు యల్లా అని అన్నారు. విశ్రాంత న్యాయమూర్తి టి.వేణుగోపాలరావు మాట్లాడుతూ.. ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఎంఎస్ సుబ్బులక్ష్మి, పండిట్ రవిశంకర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్లకు వాద్య సహకారం అందించారన్నారు. గాయకుడు మధుసూదనరావు, సి. వరదరాజులు యల్లా సంగీత సేవలను కొనియాడారు. నిర్వాహకులు కేవీ బ్రహ్మానందరావు, చిట్టిబాబు, గోళ్ల నారాయణరావుల చేతులమీదుగా యల్లా వెంకటేశ్వరరావుకు స్వర్ణ కంకణం ప్రదానం చేసి, ఘనంగా సత్కరించారు.


