మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామని శాప్ చైర్మన్ ఏ. రవినాయుడు చెప్పారు. స్థానిక బందరు రోడ్డులోని శాప్ ప్రధాన కార్యాలయంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. శాప్ ఎండీ ఎస్.భరణీతో పాటుగా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, నగరాల్లోని పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సంఘాలు, ఇతర విద్యాసంస్థలను కలుపుకొని ఈ వేసవి క్రీడా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణ శిబిరాల నిర్వహణకు శాప్ కోచ్లతో పాటుగా వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు, రిటైర్డ్ ఉద్యోగులు సేవలను వినియోగించుకుంటామన్నారు. విద్యార్థులు, యువత ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకుని క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిందిగా ఆయన కోరారు.


