న్యూస్రీల్
ఉమ్మడి జిల్లాలో ఘనంగా రంజాన్ మానవ సేవకే ప్రథమ ప్రాధాన్యం ఐజీఎంసీ స్టేడియంలో ఈద్ నమాజ్లో ఇస్లాం మత గురువులు ప్రపంచ శాంతి కోసం దువా
రూ.1.55 కోట్ల ఆర్థిక మద్దతు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
ఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2026
మచిలీపట్నంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు
భక్తుల కోసం సైన్ బోర్డులు ఏర్పాటు చేయండి
7
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ గుడిలో వసంత నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. చామంతులు, గులాబీలు, గన్నేరు పుష్పాలతో శనివారం దుర్గమ్మకు విశేష పుష్పార్చన చేశారు.
ఎ.కొండూరు: తిరువూరు నియోజక వర్గం పరిధిలోని నిరుద్యోగ యువతకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా శనివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఎ.కొండూరు మండలంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యార్డును సందర్శించారు. చైతన్యనగర్ సమీపంలో ఉన్న యార్డు గోడౌన్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలను వినియోగించుకుని త్వరలోనే భారీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం ప్రారంభించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికెట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, ఎ.కొండూరు తహసీల్దార్ అరవింద్, మార్కెట్ యార్డ్ సిబ్బంది, గిరిజన రాష్ట్ర నేత గోపిరాజు, అధికారులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): మధుమేహం, రక్తపోటు, హెచ్ఐవీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో క్షయ ముప్పు పొంచి ఉందని పలువురు శ్వాసకోశ వ్యాధుల నిపుణులు పేర్కొన్నారు. అందు బాటులోకి వచ్చిన అడ్వాన్స్డ్ చికిత్సలతో క్షయను పూర్తిగా నయం చేయొచ్చని సూచించారు. ట్యూబర్ క్యూలోసిస్(క్షయ) అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో రెండు రోజుల రాష్ట్ర స్థాయి సదస్సు శనివారం ప్రారంభమైంది. ఎంజీ రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య భవన్లో నిర్వహిస్తున్న సదస్సులో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన శ్వాసకోశ వ్యాధుల నిపుణులు, పల్మనాలజీలో పోస్టు గాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు 300 మందికిపైగా పాల్గొన్నారు. సదస్సును ఆర్గనైజింగ్ అధ్యక్షుడు డాక్టర్ రఘు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పలువురు నిపుణులు క్షయ వ్యాధికి అడ్వాన్స్డ్ వైద్యంపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉంటే క్షయ నిర్ధారణ పరీక్ష చేయించుకోవడంపై అవగాహన కలిగించాలని సూచించారు. సెషన్ల వారీగా జరిగిన సదస్సులో తొలిరోజు క్షయ వ్యాధిపై విశ్లేషణాత్మక ప్రసంగాలు, చర్చ జరిగింది. సదస్సులో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవీంద్రరెడ్డి, ఎస్టీఓ డాక్టర్ రమేష్, వైస్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ, ఏపీ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులు డాక్టర్ సుజాత, డాక్టర్ తిప్పర్తి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లాలో శనివారం రంజాన్ పండుగను ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్ను పురస్కరించుకుని ఈద్గాహ్ కమిటీ ఆధ్వర్యాన శనివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామూహిక ఈదుల్ ఫితర్ నమాజు జరిగింది. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 15 వేల మంది ముస్లింలు నమాజు చేశారు. ఈ సందర్భంగా మౌలానా హఫీజ్ రియాజ్ సాహెబ్ ఉర్దూలో సందేశాన్ని అందిస్తూ, అరబ్బీలో ఖుత్బా, నమాజ్ చేయించారు. ఆయన మాట్లాడుతూ ఇస్లాం ధర్మం పరస్పర ప్రేమానురాగాలను, సోదర భావాన్ని, ఐక్యతను చాటుతుందని కులమతాలకు అతీతంగా మానవ సేవకే ప్రథమ ప్రాధాన్యమివ్వాలన్నారు. రంజాన్ ఉపవాసాలు మనసులో మాలిన్యాన్ని దూరం చేసి శాంతి, కరుణను నింపుతాయని తెలిపారు. పవిత్ర మాసం అందించే స్ఫూర్తిని ఏడాది పొడవునా కొనసాగించాలని ప్రజలు అందరూ సుఖ శాంతులతో జీవించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక దువా చేశారు. ఇస్లామిక్ పండితుడు అబ్దుల్ ముస్తాన్ నద్వీ ధార్మిక ప్రవచనం చేస్తూ, రంజాన్ పర్వదినం మనకు తక్వా (అల్లాహ్ భయం), సహనం, దానగుణాన్ని నేర్పుతుందని ఉద్ఘాటించారు. ఇస్లాం బోధనలు మానవ జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఆయన పేర్కొన్నారు.
మత సామరస్యాన్ని పెంపొందిద్దాం
ఈద్గా కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ సమాజంలో మత సామరస్యాన్ని పెంపొందించుదామని పిలుపునిచ్చారు. నిరుపేదల అవసరాలను గుర్తించి సేవలు అందిద్దామని పేర్కొన్నారు. ఒకరి పండుగల్లో మరొకరు భాగస్వాములు కావడంతో రాజకీయంగా ఏర్పడుతున్న విభేదాలను తగ్గించి, మానవత్వాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేయాలని కోరారు. ప్రార్థనల ఏర్పాట్లకు సహకరించిన మున్సిపల్, పోలీసు శాఖలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈద్ నమాజులో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ కాలేషా వలి, సభ్యులు అన్వర్ పాషా, ఎండీ ఇర్ఫాన్, షఫీ అహ్మద్ పాషా, సయ్యద్ ఇంతియాజ్, ముక్తార్ అలీ, ఎండీ మొహిద్దీన్, సయ్యద్ అలీం ఎండీ నాహీద్ పాల్గొన్నారు.
ముస్లింలకు అండగా నిలిచిన జగన్: అవినాష్
రాష్ట్రంలో ముస్లిం కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని విధాలుగా అండగా నిలిచారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. కుటుంబ సభ్యుల్లాంటి ముస్లింలు సుఖసంతోషాలతో ఉండాలని అల్లాహ్ను కోరుకుంటున్నట్లు తెలిపారు. ముస్లింలు గత ఐదేళ్లలో ఎంతో ఆనందంగా ఉన్నారని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల అభివృద్ధికి నిరంతరం పని చేసిన వైఎస్ జగన్కు అల్లాహ్ ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన ముస్లింలకు ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా నమాజులో పాల్గొన్న వారందరినీ అవినాష్ ఆత్మీయంగా పలకరించారు.
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నంలో రంజాన్ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని ముస్లింలు ఈద్–ఉల్–ఫితర్ పర్వదినాన్ని శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. నగరంలోని ముస్తాఖాన్ పేటలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రభుత్వ ఖాజీ అన్వర్ హుస్సేన్ పర్యవేక్షణలో వాజిద్ హుస్సేన్ రంజాన్ విశిష్టతను వివరించారు. కార్యక్రమాలను ఈద్గా కమిటీ అధ్యక్షుడు మహ్మద్ రఫీ, కార్యదర్శి అష్రఫ్బాషా పర్యవేక్షించారు. ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు వైఎస్సార్ సీపీ నియోజవర్గ ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) హాజరై రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
‘రైజ్’కు నీతి ఆయోగ్ పట్టం
మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి వివిధ సేవా టికెట్ల ద్వారా ఒక రోజు ఆదాయం రూ. 10,23,173 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. శనివారం ఆయన మాట్లాడుతూ స్వామివారికి సేవా టికెట్లతో రూ. 4,26,730, లడ్డూ ప్రసాదంతో రూ. 1,05,670, నిత్యాన్నదానం ద్వారా రూ. 1,51,778, శాశ్వత అన్నదానం ద్వారా రూ. 1,85,699, శ్రీవారి దర్శనం ద్వారా రూ. 48,650.. మొత్తం రూ. 10,23,173 ఆదాయం వచ్చినట్లు వివరించారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇబ్రహీంపట్నం గుంటుపల్లిలోని రూరల్ ఇన్నోవేషన్స్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ సెంటర్( రైజ్)కు నీతి ఆయోగ్ పట్టంకట్టిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చేపడుతున్న కార్యక్రమాలకు రూ. 1.55 కోట్ల ఆర్థిక మద్దతుకు ఆమోదం తెలుపుతూ తాజాగా ఉత్తర్వులిచ్చినట్లు వెల్లడించారు. దీనిపై కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో శనివారం కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కుటుంబం– ఒక పారిశ్రామికవేత్త స్ఫూర్తికి అనుగుణంగా అడుగులు వేసి వినూత్నంగా రైజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా రూపొందించిన ఈ వినూత్న కార్యాచరణ ప్రణాళికకు నీతి ఆయోగ్ నుంచి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. దీనిపై సవివర నివేదిక పంపగా పరిశీలించి ఆర్థిక మద్దతుకు ప్రత్యేక కమిటీ ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఈ నిధులు ఇబ్రహీం పట్నం బ్లాక్లో ఏఐ ఆధారిత నైపుణ్య సర్వే, నైపుణ్యాభివృద్ధి , శిక్షణ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితరాలకు ఉపయోగపడతాయని తెలిపారు.
ఏఐ సహా విభిన్న అంశాల్లో శిక్షణ
నిత్య నూతనం– వినూత్నం నినాదానికి అనుగుణంగా మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. రైజ్ కేంద్రంలో హెల్ప్ డెస్క్, ఐడియా డెస్క్, స్కిల్లింగ్ డెస్క్, ప్లేస్మెంట్ డెస్క్, బ్యాంకింగ్ డెస్క్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీన్ని వినియోగించుకోవాలనుకునే ఔత్సాహికులు 70753 85588 నంబర్లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ శకుంతల, ఏబీపీ బ్లాక్ కో ఆర్డినేటర్ పి. శ్రీనివాస్, రైజ్ మేనేజర్ బి.తేజస్విని పాల్గొన్నారు.


