జాతీయ స్థాయి నృత్య పోటీలు ప్రారంభం
విజయవాడ కల్చరల్: కళా సాంస్కృతిక రంగాల పూర్వ వైభవానికి సంస్కార భారతి కృషి చేస్తుందని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ అన్నారు. భరతముని జయంతి సందర్భంగా సుమధు కళానికేత్, సంస్కార భారతి మహానగర్ శాఖ ఆధ్వర్యాన రెండు రోజులపాటు నిర్వహించే జాతీయ స్థాయి నృత్య పోటీలను శనివారం అయోధ్యనగర్లోని కళావేదికపై ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు సంస్కార భారతి పనిచేస్తుందని చెప్పారు. సంగీతం, నాట్యం, చిత్రలేఖనం అంశాల్లో యువతకు, చిన్నారులకు శిక్షణ తమ సంస్థ శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. నాట్యాచార్యులు సుధీర్రావు, పిళ్లా ఉమామహేశ్వరపాత్రుడు, రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రతినిధి దుర్భా శ్రీనివాస్, సంస్కార భారతి సంస్థ బాధ్యలు బోడి ఆంజనేయరాజు పాల్గొన్నారు. జాతీయ స్థాయి నృత్య పోటీలను గాంధీనగర్లోని కౌతా పూర్ణానందం కళావేదిక, ముత్యాలంపాడులోని అల్లూరి సీతారామరాజు కల్యాణ మండపం, కోదండ రామాలయం, అయోధ్యనగర్లోని హైందవి, శ్రీధర్మ పరిషత్ వేదికలపై సోలో విభాగంలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ పోటీలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు నిర్వాహకులు ప్రశంసాపత్రాలను అందజేశారు.
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి అవుట్ఫాల్ డ్రెయిన్లో పడి మృతిచెందిన సంఘటన అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జక్కంపూడి వైఎస్సార్ కాలనీకి చెందిన జయ్యద్ జానీ(45) అనే వ్యక్తి సింగ్నగర్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తుంటాడు. శుక్రవారం కూడా పనికి వెళ్లిన ఆయన రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్తూ పీకలదాకా మద్యం తాగాడు. మద్యం మత్తులో నందమూరినగర్ అవుట్ఫాల్ డ్రెయిన్ వెంబడి రోడ్డుపైనే నిద్రించాడు. శనివారం తెల్లవారుజామున చూసే సరికి జానీ అవుట్ఫాల్ డ్రెయిన్లో పడిపోయి శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పటల్కు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


