యానాదులకు దొరకని పునరావాసం
గుడిసెలు కూలిపోవడంతో ఈదురు గాలుల్లో పునరావాసం కోసం ఎదురుతెన్నులు ఏజే కాలేజీకి వెళితే కనీసం గది ఇవ్వని దుస్థితి
మచిలీపట్నంటౌన్: నగరంలోని 36వ డివిజన్ రాజుపేట మగ్గాల కాలనీకి చెందిన 20 యానాది కుటుంబాల వారు తుఫాన్ నేపథ్యంలో పునరావాసం లేక ఇబ్బందులు పడ్డారు. తుఫాన్ పెనుగాలులకు మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వారు నివసిస్తున్న గుడిసెలు దెబ్బతిని నివాసానికి ఇబ్బందిగా మారాయి. అదే ప్రాంతంలో ఓ భారీ వృక్షం నేలకూలింది. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ యానాదుల కాలనీవాసులు 36వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ మాచవరపు రాంప్రసాద్ ను సంప్రదించారు. దీంతో ఆయన వారిని డివిజన్ లోని ఆంధ్ర జాతీయ కళాశాలలో ఉంచేందుకు తీసుకెళ్లారు. అయితే వారు తల దాచుకునేందుకు గది ఇచ్చేందుకు కళాశాల నిర్వాహకులు విముఖత చూపారు. తమ కళాశాలలో పునరావాస కేంద్రం లేదని మరుగుదొడ్ల సమస్య ఉందని చెప్పారు. దీంతో కార్పొరేటర్ రాంప్రసాద్ తహసీల్దార్ కు ఫోన్ చేసి పరిస్థితిని చెప్పడంతో 50వ డివిజన్ తుఫాన్ సెంటర్లో పునరావాసం ఏర్పాటు చేశామని, వారిని అక్కడకు తీసుకువెళ్లాలని చెప్పారు. తాము ఉదయం నుంచి ప్రచారం చేస్తున్న వారు ఎందుకు పునరావాస కేంద్రానికి వెళ్లలేదని ఆయన ఎదురు ప్రశ్నించారు. హోరు గాలిలో పిల్లాపాపలతో ఉన్న యానాదులను దాదాపు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పునరావాస కేంద్రానికి ఎలా తీసుకువెళ్లాలని రాంప్రసాద్ తహసీల్దార్ను ప్రశ్నించారు. గతంలో ఏ విపత్తు వచ్చినా ఈ కళాశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసే వారమని ఇంత భారీ తుఫాన్ వస్తున్న సమయంలో ఇక్కడ పునరావాస కేంద్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని రాంప్రసాద్ తహసీల్దార్ను నిలదీశారు. చేసేది లేక చివరకు వారంతా కళాశాల వరండాలోనే తలదాచుకుంటుండగా కార్పొరేటర్ రాంప్రసాద్ వారికి తాగునీరు, అల్పాహారం వంటివి అందజేశారు.


