
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పాపారావు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం సాక్షిలో ‘దందాకు అండదండలు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా మళ్లీ మళ్లీ చేస్తున్న వ్యక్తులపై నిఘా పెట్టామన్నారు.
ప్రివెంటివ్ ఆఫ్ బ్లాక్ మార్కెట్ యాక్టు ప్రకారం ఐదుగురిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్, పోలీసు కమిషనర్కు సూచించినట్లు తెలిపారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్ మెంట్ను కట్టుదిట్టం చేశామని, బియ్యం సరిహద్దులు దాట కుండా పకడ్బందీ చర్యలు తీసుకొంటున్నామని వివరించారు. ప్రభుత్వం రూపొందించిన యాప్లో అన్లైన్లో ఆర్ఐలు, డీటీలు, తహసీల్దార్లు, ఆర్డీఓలు తనిఖీలు చేసి వివరాలు నమోదు చేస్తున్నారన్నారు. బియ్యం పక్కదారి పట్టకుండా ప్రజలకు నిత్యావసర సరుకులను సక్రమంగా అందేలా చర్యలు తీసుకొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రివెంటివ్ ఆఫ్ బ్లాక్ మార్కెట్ యాక్టు ప్రకారం క్రిమినల్ చర్యలకు సిఫారసు చేసిన ఐదుగురిలో రేషన్ బియ్యం మాఫియా డాన్ రామచంద్రరావు పేరు ఉన్నట్లు సమాచారం. ఇతనిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.
క్షేత్ర స్థాయిలో తనిఖీలు ముమ్మరం డీఎస్ఓ పాపారావు