
తమ్ముళ్లకే సబ్సిడీల్
పెడన: ఆధునిక వ్యవసాయంలో యంత్ర పరికరాల వినియోగం అనివార్యమైంది. కౌలు రైతులు, పేద, మధ్యతరగతి రైతులకు యంత్ర పరికరాలను సమకూర్చుకునే ఆర్థిక స్తోమతు ఉండదు. ఈ నేపథ్యంలో పొలాలను దుక్కి దున్నడం నుంచి పంట నూర్పిడి వరకు అవసరమైన యంత్ర పరికరాలను గతం నుంచి ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తూ ఆదుకుంటోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హత ఆధారంగా సబ్సిడీ యంత్రపరికరాలు అందడంలేదు. 40 నుంచి 50 శాతం రాయితీతో గ్రామ సచివాలయాల ద్వారా మంజూరు చేసే యంత్రపరికరాలను తమకు అనుకూలమైన రైతులకు మాత్రమే ఇవ్వాలని టీడీపీ నాయకులు ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాల మేరకు తెలుగు తమ్ముళ్లకే యంత్రపరికరాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించిన అనంతరమే యంత్రపరికరాలను మంజూరు చేస్తున్నామని అధికారులు చెప్పుకొస్తున్నారు. అర్హత ఉన్నా యంత్రపరికరాలు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
యంత్రపరికరాలు అనివార్యం
గతంలో కూలీలు, పశువుల సహకారంతో రైతులు వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు కూలీల సంఖ్య తగ్గిపోవడం, కూలి ధరలు అధికం కావడంతో దూర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి పనులు చేయించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటిని అధిగమించడానికి అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకుంటు వ్యయభారాలను తగ్గించుకుంటున్నారు. ఈ క్రమంలో కూడా ఆయా ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలను అందజేస్తూ వస్తున్నాయి. పరికరం సామర్థ్యాన్ని బట్టి 40 నుంచి 50 శాతం వరకు రాయితీపై అందిస్తారు. ట్రాక్టరు అనుబంధ పరికరాలను ట్రాక్టరున్న రైతులకు మాత్రమే అందించేలా చర్యలు చేపట్టారు. ఆయిల్ ఇంజిన్లు, కల్టివేటర్లు, పవర్ స్ప్రేయర్లు వంటి యంత్రాలు అందరికీ అవసరమే. వీటిని అర్హత మేరకు రైతులకు మంజూరు చేయాలి. కూటమి అధికారంలో వచ్చిన పిమ్మట కేవలం తమ పార్టీకి అనుకూలమైన వారికే మాత్రమే సబ్సిడీపై యంత్రపరికరాలను మంజూరు చేసేలా కూటమి నాయకులు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రైతులకు అందించే యంత్రపరికరాలు ఇవీ..
రైతులకు సబ్సిడీపై అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మండల వ్యవసాయశాఖకు పలు యంత్రపరికరాలు చేరాయి. బ్యాటరీ, పవర్ స్ప్రేయర్లు, దుక్కు పరికరాలు, రోటావీటర్లు, పవర్ వీడర్లు, పవర్ టిల్లర్లు వంటి యంత్రపరికరాలు వచ్చాయి. మరి కొన్ని యంత్ర పరికరాలు రావాల్సి ఉంది. వచ్చిన వాటిని వచ్చినట్లుగా కూటమి నాయకులు చెప్పిన రైతులకు అధికారులు అందజేస్తున్నారు.
తెలుగు తమ్ముళ్లకే సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు తాము సూచించిన వారికే ఇవ్వాలని కూటమి నాయకుల హుకుం యంత్రపరికరాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసినవారికే పంపిణీ చేశామంటున్న అధికారులు
ఆన్లైన్ దరఖాస్తుల ప్రకారమే..
రైతులకు అనేక రకాల యంత్ర పరికరాలను ప్రభుత్వం రాయితీపై ఇస్తోంది. దీన్ని అందరూ వినియోగించుకోవాలి. ఎక్కువ మంది ఆయిల్ ఇంజిన్లు కావాలంటున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే యంత్రపరికరాలను అందజేశాం. ఇంకా కొన్ని రావాల్సి ఉంది. వాటిని కూడా రాగానే దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అందజేస్తాం. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకావశం లేదు. ప్రభుత్వం సూచించిన సమయంలోనే అర్హులైన రైతులు తమకు కావల్సిన యంత్రపరికరాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకున్న వారికే సబ్సిడీపై యంత్రాలను అందజేస్తాం.
– నూరున్నీసా, ఇన్చార్జి ఏఓ, పెడన మండలం

తమ్ముళ్లకే సబ్సిడీల్