ఎఫెక్ట్
ఆసిఫాబాద్రూరల్: కుమురంభీం ప్రాజెక్టు కుడి కాలువ అసంపూర్తి పనులతో కోతకు గురై ఆసిఫాబాద్ మండలంలోని మానిక్గూడ ప్రాథమిక పాఠశాల, గ్రామానికి ముప్పు పొంచి ఉందని ఈ నెల 15న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కోత ముప్పు’ వార్తకు అధికారులు స్పందించారు. మానిక్గూడ గ్రామంలో శుక్రవారం రూ.48లక్షల వ్యయంతో కరకట్ట నిర్మాణానికి కలెక్టర్ కె.హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి భూమిపూజ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అడ ప్రాజెక్టు కుడి కాలువ కొన్నేళ్లుగా వర్షాలకు మట్టి కోతకు గురై ప్రమాదకరంగా మారిందన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా, వరద ముప్పును తొలగించేందుకు రక్షణ కోసం కరకట్ట నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి అడుగులు పడటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాము, అడ ప్రాజెక్టు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.


