కాగజ్నగర్టౌన్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులు పేదింటి విద్యార్థులకు భరోసా కల్పిస్తున్నాయి. కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మార్సీ భవనంలో ఈ శిక్షణ శిబిరం విజయవంతంగా కొనసాగుతోంది. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులను పాలిసెట్, టీజీఎస్డబ్ల్యూఆర్జేసీసీఈటీ, టీజీఆర్జేసీ, సైనిక్ స్కూల్, తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నారు. జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ ఆలోచనలతో డీఈవో పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన ప్రభుత్వ ఉపాధ్యాయ బృందం ఆయా సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తున్నారు. ఓ వైపు బోధన కొనసాగిస్తూనే మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారు. పాఠ్యాంశాలపై పట్టు పెంచేలా సందేహ నివృత్తి సెషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 120 మంది చేరగా, ఇంకా ప్రవేశాల కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
నిపుణుల మార్గదర్శనం
ఉచిత శిక్షణలో భాగంగా ప్రత్యేక స్టడీ మెటీరియల్ అందించడం, వారానికి ఒకసారి పరీక్షలు నిర్వహించడం, బలహీన విద్యార్థులకు అదనపు క్లాసులు ఏ ర్పాటు చేస్తున్నారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రతిఒక్కరూ విజయం సాధించేలా మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇలాంటి శిక్షణ కేంద్రాలను మరిన్ని మండలాలకు విస్తరించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏటా ఫలితాలు మెరుగుదల
ఈ శిక్షణ తరగతులకు ఆసిఫాబాద్, కాగజ్నగర్, దహెగాం, కౌటాల, పెంచికల్పేట్ మండలాల వి ద్యార్థులు ఎక్కువగా హాజరవుతున్నారు. గత మూడేళ్లుగా గణనీయమైన ఫలితాలు సాధిస్తున్నారు. 2023లో పాలిటెక్నిక్లో 108 మంది విద్యార్థులు శిక్షణ పొందితే 98 మంది అర్హత సాధించగా, 2024లో ఈ సంఖ్య పెరిగి 150 మందికి 121 మంది అర్హత సాధించారు. 2025లో కూడా అదే ఉత్సాహంతో 150 మందికి 125 మంది పాలిటెక్నిక్, గురుకులాల్లో సీటు పొందారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉచిత కోచింగ్ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.


