ఆసిఫాబాద్: పోషణ్ అభియాన్ కింద అంగన్వాడీ కార్యకర్తలకు అందించిన ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ మంత్రి సీతక్కపై చేసిన ఆరోపణలు నిరాధారమని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంత్ చేసిన ఆరోపణలు ఖండించారు. రాజకీయ లాభం కోసం మంత్రి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. మహిళా శిశుసంక్షేమ శాఖ 2025– 26 ఆర్థిక సంవత్సరానికి 38,130 స్మార్ట్ ఫోన్లను కొనుగోలును తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా జెమ్ పోర్టల్లో పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ నేతలు వాస్తవాలు వక్రీకరించడం మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు ఉబేద్బిన్ యాహియా, కాట్కర్ భీమ్రావు, ప్రధాన కార్యదర్శులు గాదెవేణి మల్లేశ్, నాంపల్లి శంకర్, నాయకులు సిడాం తిరుపతి, రాము, మోహన్ పాల్గొన్నారు.


