జిల్లాలో తునికాకు సేకరణ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో తునికాకు సేకరణ లక్ష్యం

Apr 15 2026 7:32 AM | Updated on Apr 15 2026 7:32 AM

● తునికాకు సేకరణలో భాగంగా చెట్టు నుంచి కేవలం ఆకులు మాత్రమే సేకరించాలి. కొమ్మలు నరకడం లేదా చెట్టుకు హాని చేయకూడదు. ● అటవీ ప్రాంతంలో అధికారులు నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే సేకరించాలి. దట్టమైన ప్రాంతాల్లోకి వెళ్లకూడదు. ● వన్యప్రాణులు, చెట్లకు ఎలాంటి హాని తలపెట్టవద్దు. అటవీశాఖ ఆస్తులకు ఎలాంటి నష్టం చేయొద్దు. ● వన్యప్రాణుల సంచారం, కదలికల నేపథ్యంలో కూలీలు గుంపులుగా వెళ్లాలి.

తునికాకు సేకరణకు సర్వం సిద్ధం

జిల్లాలో 13 కల్లాలు, 161 యూనిట్లు ఏర్పాటు

23,400 స్టాండర్డ్‌ బ్యాగుల లక్ష్యం

సలహాలు, సూచనలు

తునికాకు సేకరణలో కూలీలపై ఎలాంటి ఆంక్షలు లేనప్పటికీ అటవీ అధికారులు పలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. ప్రజలు నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.

తునికాకు పేరుస్తున్న ఓ కుటుంబం(ఫైల్‌)

డివిజన్‌ యూనిట్లు కల్లాలు స్టాండర్డ్‌ బ్యాగులు కట్టలు

ఆసిఫాబాద్‌ 2 22 5700 57,700

కాగజ్‌నగర్‌ 11 139 17700 1,77,000

మొత్తం 13 161 23,400 2,34,000

చింతలమానెపల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వేసవి పంటగా తునికాకు సేకరణ ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తోంది. ఆర్థికంగా ఆసరా అందిస్తోంది. జిల్లాలో మే నెలలో తునికాకు సేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. జిల్లాలో 13 యూనిట్లలో 161 కల్లాలు ఏర్పాటు చేయనున్నారు. ఆసిఫాబాద్‌ అటవీ డివిజన్‌లో జోడేఘాట్‌, రెబ్బెన రేంజ్‌లో గిరవెల్లి, కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌లో బె జ్జూర్‌, సలుగుపల్లి, గూడెం, ఖర్జెల్లి, చీలపెల్లి, ము త్తంపేట్‌, కొత్తపేట్‌, అనుకోడ, పెంచికల్‌పేట్‌, లోనవెల్లి, డబ్బా యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.

టెండర్లు పూర్తి

జిల్లాలో సేకరించే తునికాకు నాణ్యత పరంగా రాష్ట్రస్థాయిలో పేరు పొందింది. ఖర్జెల్లి రేంజ్‌లోని గూ డెం, బెజ్జూర్‌ రేంజ్‌ పరిధిలోని బెజ్జూర్‌, సలుగుపల్లి యూనిట్లలో సేకరించే తునికాకు ప్రత్యేక గుర్తిపు ఉంది. ఈ ఏడాది తునికాకు సేకరణలో భాగంగా యూనిట్లకు అటవీశాఖ టెండర్లను ఆహ్వానించింది. ఫిబ్రవరిలోనే టెండర్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. కొమ్మ కొట్టడం పూర్తి కాగా, మే మొదటి వారం నుంచి తునికాకు సేకరణ ప్రారంభించే అవకాశం ఉంది. 161 కల్లాల పరిధిలో 23,400 స్టాండర్డ్‌ బ్యాగులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది కూలీలకు కట్టకు రూ.3.40 చెల్లించనున్నారు. సుమారుగా 20వేల మంది ఉపాధి పొందుతారని అంచనా వేస్తున్నారు.

ఓ వైపు వన్యప్రాణులు.. మరోవైపు ఎండలు

జిల్లాలో తునికాకు సేకరణలో ఈ ఏడాది భిన్నమైన పరిస్థితులను కూలీలు ఎదుర్కోనున్నారు. అటవీ శాఖ ఆంక్షలు లేవని అధికారులు చెబుతుండగా, వన్యప్రాణులు, పెద్ద పులుల సంచారంతో కూలీల్లో కొంత ఆందోళన ఉంది. గతంలో కాగజ్‌నగర్‌ డివిజన్‌లో పులుల కదలికలతో తునికాకు సేకరణ లో ఆటంకాలు ఎదురయ్యాయి. మరోవైపు మండతున్న ఎండలతో ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యా యి. కూలీలకు ప్రమాదవశాత్తు వన్యమృగాల ద్వారా ఏదైనా ప్రమాదం జరిగినా.. ఎండదెబ్బ కా రణంగా మరణించినా బీమా సౌకర్యం కల్పించి పరిహారం అందించనున్నారు. వేసవిలో ఉపాధి అందించే తునికాకు సేకరణలో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కూలీలు డిమాండ్‌ చేస్తున్నా రు. తునికాకు ద్వారా ప్రభుత్వానికి ఆదా యం వస్తున్న నేపథ్యంలో నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కట్ట ధర పెంచాలని, బోనస్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ప్రమాదాలు జరిగిన సమయంలో అందించే పరిహారం పెంచాలని, తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, వైద్యం, మందులను అందుబాటులో ఉంచాలని విన్నవిస్తున్నారు.

విజయవంతంగా నిర్వహిస్తాం

తునికాకు సేకరణ విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోనే కాగజ్‌నగర్‌ డివిజన్‌లో లభించే తునికాకు నాణ్యతలో ఉత్తమమైందిగా పేరుగాంచింది. కూలీలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అటవీ అధికారులు అందించే సలహాలు, సూచనలు పాటించాలి.

– అప్పయ్య, కాగజ్‌నగర్‌ డివిజన్‌ అటవీ అధికారి

వేసవి పంట..

Advertisement
 
Advertisement
Advertisement