నిర్మల్ఖిల్లా: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానంలో నూతన సంస్కరణలు తీసుకురానున్నట్లు విశ్వవిద్యాలయ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వెంకటయ్య వెల్లడించారు. కాకతీయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల డిగ్రీ పరీక్షల జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యాంకనంపై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధ్యాపకులకు ఆన్లైన్ మూల్యాంకన విధానం, సాంకేతిక అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేయూ వైస్ ఛాన్స్లర్ ప్రోఫెసర్ ప్రతాప్రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ సూచనల మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సెమిస్టర్ల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తిగా ఆన్లైన్లో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దీంతో మూల్యాంకనం వేగవంతం అవుతుందని, ఫలితాలు సకాలంలో విడుదలవుతాయని వెల్లడించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ గంగాధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం సూపరింటెండెంట్ ప్రతాప్, టెక్నికల్ అసిస్టెంట్లు కుమార్, విష్ణు, విజయ్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ హేమలత, సూర్యసాగర్, పీజీ.రెడ్డి, అర్చన, సుభాష్, శ్రీనివాస్, రమేశ్రెడ్డి, శ్రీహరి, పవన్కుమార్, ఉమేష్, రజిత, రహమాన్, దిలీప్, రవీందర్, రంజిత్, నరేందర్, త్రిపాఠి, మురహరి, మునావర్ తదితరులు పాల్గొన్నారు.


