ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో శుక్రవారం నిర్వహించే కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ హాజరవుతారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. ఇటీవల జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించిన 54 మందితో మధ్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాలు అందిస్తారన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవల్సిన చర్యలపై నాయకులకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి ఏఐసీసీ ప్రతినిధి సచిన్ సావంత్, మీనాక్షి నటరాజన్ హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల్ల మంగ, ఆత్మ చైర్మన్ గడ్డల సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు తారిక్, నాయకులు గాదెవేణి మల్లేశ్, సుధాకర్, జక్కయ్య, భీమ్రావు, సంతోష్, సత్తన్న పాల్గొన్నారు.


