దహెగాం: సంక్షేమమే ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 యాక్షన్ ప్లాన్లో భాగంగా గురువారం మండలంలోని చినరాస్పెల్లి పంచాయతీలో సర్పంచ్ తెలిగే రాజేశ్వరి అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి హాజరయ్యారు. ముందుగా తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని ఆదేశించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఉచిత కరెంట్, సన్నరకం వడ్లకు బోనస్, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, తదితర పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ తాళ్లపల్లి రామారావు, డీపీవో భిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


