తిర్యాణి: నీటిని పొదుపుగా వాడితేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్కుమార్ టెబ్రివాల్ అన్నారు. మండలంలోని చెలిమల వాగు ప్రాజెక్టు వద్ద ఆదివారం ప్రపంచ జల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు నీటి ఆదాతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ అడవులను రక్షిస్తేనే వర్షాలు సమృద్ధిగా కురిసి జలసిరులు పారుతాయన్నారు. చెలిమల వాగు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. అడవులను నరుక్కుంటూ పోతే చివరికి ప్రాణవాయువైన ఆక్సిజన్ను కూడా కొనుక్కోవాల్సి వస్తుందన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా అటవీ ప్రాంతాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీనివాస్, గిన్నెధరి రేంజ్ అధికారి సరోజినిదేవి, వివిధ గ్రామాల సర్పంచులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.


