అభివృద్ధికి సమష్టిగా పని చేయాలి
ప్రసంగిస్తున్న కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్: జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా అభివృద్ధికి సమష్టిగా పని చేస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో సోమవారం 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో క లిసి హాజరయ్యారు. ముందుగా కలెక్టర్, ఎస్పీ పో లీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ హరిత జాతీయ జెండా ఆవిష్కరించారు. నా లుగు ప్లాటూన్లకు చెందిన పోలీసులు కవాతు నిర్వహించారు. ఇందులో ఒక మహిళా ప్లాటూన్ కూడా ఉండటం విశేషం. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రగతిని చదివి వినిపించారు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంగా అవతరించి ప్రజలు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వంతో జీవిస్తున్నారని తెలిపారు.
పురోగతిలో ఇందిరమ్మ ఇళ్లు
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా జిల్లాకు 2024 25 సంవత్సరానికి 9,057 ఇళ్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 19 ఇళ్లు పూర్తి కాగా, 5,671 ఇళ్లు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం కింద ఇప్పటి వరకు 15,73,148 జీరో బిల్లులు జారీ చేయగా 1,23,312 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. ఈ పథకం కింద ప్రభుత్వం రూ.50.57 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
‘మహాలక్ష్మి’తో రూ.50.91 కోట్ల లబ్ధి
మహాలక్ష్మి పథకం కింద 1.99 కోట్ల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోవడం ద్వారా రూ.50.91 కోట్ల లబ్ధి పొందారని వెల్లడించారు. 78,369 మందికి 3,01,284 రాయితీ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసి, మహిళల ఖాతాల్లో రూ.8.32 కోట్లు జమ చేశామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 6,582 మంది పేదలు చికిత్స పొందారని తెలిపారు.
రైతుల ఖాతాల్లో రూ.251కోట్లు
రైతు భరోసా పథకం కింద 2025– 26 వానాకాలంలో 1,33,302 మంది రైతుల ఖాతాల్లో రూ.251 కో ట్లు జమ చేశామన్నారు. యాసంగి పంట సాగుకు 2,800 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని తెలిపారు. రైతుబీమా పథకం కింద 195 మంది రైతు కుటుంబాలకు రూ.9.75 కోట్లు చె ల్లించామన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 1,100 ఎకరాల ఆయిల్పామ్ సాగు లక్ష్యం కేటాయించగా, ఇప్పటివరకు 368 ఎకరాల్లో తోటలు సాగు చేస్తున్న 98 మంది రైతులకు రూ.28,49,259 విలువైన మొక్కలు వందశాతం రాయితీపై అందించామని తెలిపారు. 2025– 26 సంవత్సరానికి సంబంధించి 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి 8,202 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రూ.19.60 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 1,62,681 ఆహార భద్రత కార్డులకు 315 రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.
కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు
జిల్లా ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందించేందుకు జిల్లా ఆస్పత్రిల్లో పరికరాలు సమకూర్చామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి జిల్లాలోని 721 పాఠశాలల్లో రూ.11.69 కోట్లు ఖర్చు చేసి వసతులు కల్పించామని తెలిపారు. 2024– 25 విద్యా సంవత్సరంలో 9,676 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ద్వితీయ సంవత్సరంలో జిల్లా రాష్ట్రస్థాయిలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు.
మహిళా సంఘాల బలోపేతంపై దృష్టి
ఇందిర మహిళా క్రాంతి పథకం ద్వారా జిల్లాలోని 93,641 గ్రామీణ మహిళలతో 8,170 స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2,581 సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా ఇప్పటివరకు రూ.161,62 కోట్ల రుణాలు మంజూరు చేశామని తెలిపారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. కాగజ్నగర్ మున్సిపాలిటీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.45 లక్షలతో 30 పనులను చేపట్టినట్లు వివరించారు. సీడీపీ ఎస్డీఆర్ఎఫ్ నిధులు రూ.91 లక్షలతో 34 పనులు చేపట్టామని తెలిపారు. మత్స్యశాఖ ద్వారా 76 మత్స్య సంఘాల్లోని 3,050 మంది సభ్యులకు రాయితీపై 133 జలాశయాల్లో 1.80 కోట్ల చేప పిల్లలను సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన నలుగురి కుటుంబాలకు రూ.20 లక్షల ప్రమాదబీమా మంజూరు చేశామన్నారు.
రాష్ట్రస్థాయికి జిల్లా క్రీడాకారులు
సీఎం కప్లో భాగంగా 44 క్రీడావిభాగాల్లో పోటీలు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తున్నామన్నారు. మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1,006 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 50,267 మంది పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అనుబంధ పోషకాహార పథకం కింద ప్రతిరోజూ గుడ్డు, పాలు, ఒక పూట భోజనం అందిస్తున్నామని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 11 కళాశాలల వసతి గృహాల్లో 437 మంది విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. 50 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో 9,770 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. 594 మంది గిరిజన విద్యార్థులకు రూ.62.18 లక్షలు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు విడుదల చేశామన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెండు బాలురు, రెండు బాలికల గురుకులాల ద్వారా 1,556 మందికి భోజన వసతి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్రావు, కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న కలెక్టర్ హరిత
అభివృద్ధికి సమష్టిగా పని చేయాలి
అభివృద్ధికి సమష్టిగా పని చేయాలి
అభివృద్ధికి సమష్టిగా పని చేయాలి


