అన్నివర్గాల ప్రజలకు న్యాయం | - | Sakshi
Sakshi News home page

అన్నివర్గాల ప్రజలకు న్యాయం

Dec 5 2025 6:09 AM | Updated on Dec 5 2025 6:09 AM

అన్ని

అన్నివర్గాల ప్రజలకు న్యాయం

ఉమ్మడి జిల్లాకు సీఎం వరాలు

ఆదిలాబాద్‌కు త్వరలోనే ఎయిర్‌బస్‌

యూనివర్సిటీ ఏర్పాటుకు సుముఖం

‘కొరటా– చనాఖా’ను

జాతికి అంకితం చేస్తాం

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్‌ నిర్మిస్తాం..

ఆదిలాబాద్‌ సభకు తరలివచ్చిన జనం

‘హస్తం’ శ్రేణుల్లో జోష్‌

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన అందిస్తుంది. జిల్లాలోని రైతులకు మేలు చేకూర్చేలా రూ.2,500 కోట్ల రుణమాఫీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించాం. అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులిచ్చాం. పేదలు దొడ్డుబియ్యం తినకుండా అమ్ముకుంటున్నారని గుర్తించి వారి కడుపునింపేలా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. ప్రజాపాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదించాలి.

– పి.సుదర్శన్‌రెడ్డి,

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు

పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

ప్రభుత్వం రూ. లక్ష ల కోట్ల అప్పులు న్నా.. ప్రతీ నెలా రూ. కోట్ల రూపేనా వడ్డీలు చెల్లిస్తున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ, అభివృద్ధిని ఎక్కడా ఆపకుండా అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద విద్యార్థులు ఖర్చులేకుండా కార్పొరేట్‌స్థాయిలో విద్యనభ్యసించేలా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మంజూరు చేశాం. రెండేళ్లలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందించేలా ప్రతిపాదనలు స్వీకరించాం. త్వరలోనే ఆ మొత్తాన్ని అందజేస్తాం. జిల్లాను పర్యాటకపరంగా ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.

– జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి

ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

సభకు హాజరైన జనం

ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌: ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ సక్సెస్‌ కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం నిర్వహించిన సభకు జనం భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాక గంటన్నర ఆలస్యమైనా ప్రజలు ఓపిగ్గా ఎదురుచూశారు. జిల్లాలో రూ.260 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సంబంధించి సభ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణతో సభను ప్రారంభించారు. ఇందులో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్‌, జి.వినోద్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, విఠల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్‌, శ్యాంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌ జిల్లా అంటే అభిమానం..: సీఎం

ఆదిలాబాద్‌ జిల్లా అంటే తనకు ఎంతో అభిమానమని, పీసీసీ అధ్యక్షుడినయ్యాక ఇక్కడి నుంచే కార్యక్రమాలను ప్రారంభించానని సీఎం గుర్తు చేశారు. జిల్లాను దత్తత తీసుకున్నానని త్వరలోనే అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తానని పేర్కొన్నారు. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న జిల్లాకు ఏడాదిలోనే ఎయిర్‌బస్సు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అలాగే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీ మంజూరు చేయనున్నట్లుగా హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి కేంద్రంగా నాగోబా సన్నిధిలో కుమురంభీం పేరిట ఉంటే బాగుంటుందని, ఇది తన సూచనగా పేర్కొన్నారు. అలాగే మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీని ప్రైవేట్‌ సెక్టార్‌లో పునః ప్రారంభించేలా చర్యలు తీసుకుని ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. కొరటా–చనాఖ ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని పేర్కొన్నారు. అలాగే కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహితపై ప్రాజెక్ట్‌ నిర్మించి ఉమ్మడి జిల్లా సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందించేలా జిల్లాకు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను మంజూరు చేసినట్లుగా వివరించారు. ఇలా సీఎం జిల్లాకు అనేక వరాలు కురిపించడంతో ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

భారీ బందోబస్తు

సీఎం పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీల నాయకులను పోలీసులు వేకువజామునే ముందస్తు అరెస్ట్‌లు చేసి స్టేషన్లకు తరలించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు. సీఎం రాకను సభ ప్రాంగణంలో ఉన్న ప్రజలకు తెలియజేసేలా డ్రోన్‌ కెమెరాలతో ప్రత్యేక స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆ స్క్రీన్‌ ద్వారా ప్రదర్శించారు. అంతకు ముందు ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, కాంగ్రెస్‌ నాయకులు, ట్రెయినీ కలెక్టర్‌ సలోనిచాబ్రా హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుని సీఎంకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

యువత నైపుణ్యాభివృద్ధికి చర్యలు

అహంకార, అవినీతి కారణంగానే గత ప్రభుత్వాన్ని ప్రజలు ఓటు ద్వారా గద్దెదించి ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను అమలు చేస్తున్నాం. బీఆర్‌ఎస్‌ పాలనలో అమలు కాని అనేక పథకాలను ప్రజలకు అందిస్తున్నాం. ముఖ్యంగా యువతలో నైపుణ్యాలు మెరుగుపర్చేలా ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేశాం. – గడ్డం వివేక్‌, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి

అన్నివర్గాల ప్రజలకు న్యాయం
1
1/2

అన్నివర్గాల ప్రజలకు న్యాయం

అన్నివర్గాల ప్రజలకు న్యాయం
2
2/2

అన్నివర్గాల ప్రజలకు న్యాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement