
కొనుగోళ్లకు సన్నద్ధం
ఏడు సీసీఐ కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళిక 16 లక్షల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా జిల్లాలో 3,33,739 ఎకరాల్లో పత్తి సాగు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో పత్తి దిగుబడులు మరి కొద్దిరోజుల్లో రైతుల చేతికి అందనున్నాయి. దీంతో సీసీఐ ఆధ్వర్యంలో నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. దిగుబడి అధికంగా వచ్చే ప్రాంతాలను గుర్తించి, రైతులకు అందుబాటులో సౌకర్యవంతంగా ఉండేలా ఏడు కేంద్రాలను గుర్తించి సీసీఐకి నివేదికలు పంపించారు. ఆయా కేంద్రాల్లో వేబ్రిడ్జిలు, కంప్యూటర్లు, ఇతర వసతుల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. అయితే కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ ద్వారా కొనుగోళ్లు చేపట్టనుండగా, రైతులు ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడకుండా, రైతులు కూడా రోజుల తరబడి నిరీక్షించకుండా నిర్దేశించిన సమయంలో అమ్మకానికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
3,33,779 ఎకరాల్లో సాగు
జిల్లాలో 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంట లు సాగవుతుండగా 3,33,779 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. జిల్లాలోని నేలలు పత్తికి అనుకూలంగా ఉండటంతో రైతులు ఎక్కువగా వాణిజ్య పంటపైనే ఆధారపడుతున్నారు. ఈ ఏడాది సుమారు 16లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తిస్థాయిలో పంటను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ఆసిఫాబాద్, వాంకిడి, కొండపల్లి, కాగజ్నగర్, సిర్పూర్(టి), కౌటాల, జైనూర్లో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కొనుగోళ్లతోపాటు బిల్లుల చెల్లింపు కోసం ఆధార్కా ర్డు, వేలిముద్రలను పరిశీలించనున్నారు. కౌలు రైతులైతే పట్టాదారుల పాస్ పుస్తకంతోపాటు ఆధార్కార్డు వివరాలు అందించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన పత్తికి రూ.8,110గా ప్రకటించింది. 8శాతం తేమ ఉంటే పూర్తిస్థాయి మద్దతు ధర దక్కుతుంది. అంతకంటే ఎక్కువ శాతం తేమ ఉంటే ఒక్కోశాతానికి రూ.81.10 చొప్పున తగ్గించి కొంటారు. పత్తిని సక్రమంగా ఆరబెట్టి తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.
యాప్లో స్లాట్ బుకింగ్
పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ అనే యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్ను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని రైతులు సొంతంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. లేకుంటే వ్యవసాయ అధికారుల సాయంతోనూ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వా త పంట అమ్మకం కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. రద్దీకి అనుగుణంగా రైతులకు తేదీ కేటాయిస్తారు. నూతన విధానం కొనుగోళ్లపై ఈ నెలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.