
ప్రాణాలపై పట్టింపేది?
వాగులు ఉప్పొంగి గ్రామాలకు రాకపోకలు బంద్ ఆస్పత్రులకు చేరుకునేందుకు అష్టకష్టాలు అనార్పల్లి వాగు వద్ద శుక్రవారం మరొకరు మృతి
కెరమెరి(ఆసిఫాబాద్): జిల్లాలోని వాగులు ఉప్పొంగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే వా రు కరువయ్యారు. అసంపూర్తి వంతెనలు పూర్తి చేయడంతోపాటు లోలెవల్ వంతెన వద్ద హైలెవల్ బ్రిడ్జీలు నిర్మించడంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కెరమెరి మండలం అనార్పల్లి వాగు ఉప్పొంగి సకాలంలో ఆస్పత్రికి చేరుకోకపోవడంతో శుక్రవారం ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ మండలంలో గుండి వాగు, కెరమెరి మండలంలో లక్మాపూర్, అనార్పల్లి, చింతలమానెపల్లి మండలం దిందా వాగు ఉప్పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రజలు అత్యవసర సమయంలో ప్రమాదకరంగా వాగులు దాటుతున్నారు.
అసంపూర్తిగా వంతెనలు..
కెరమెరి మండలంలోని లక్మాపూర్ వాగుపై వంతెన రూ.3కోట్ల అంచనా వ్యయంతో 2016లో ప్రారంభమై 2017లో పూర్తి కావాల్సి ఉంది. కానీ పిల్లర్లు నిర్మించి వదిలేశారు. ముగ్గురు కాంట్రాక్టర్లు మారినా పనులు ముందుకు సాగడం లేదు. అలాగే అనార్పల్లి వాగుపై రూ.5కోట్ల అంచనా వ్యయంతో 2016లో పనులు ప్రారంభమై 2018 నాటికి పూర్తి చేయాలి. కానీ ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. కరంజీవాడ, బోరిలాల్గూడ, జనకాపూర్ తదితర గ్రామాల ప్రజలు అనార్పల్లి వాగు దాటితేనే కెరమెరి మండల కేంద్రానికి చేరుకుంటారు. వాగులో వరద పెరిగితే వారు బాహ్య ప్రపంచానికి దూరం కావాల్సిందే..
వాగు దాటేందుకు ప్రాణాలు పణం
లక్మాపూర్, అనార్పల్లి వాగులు దాటేందుకు ఆయా గ్రామాల ప్రజలు ప్రాణాలు పణంగా పెడుతున్నారు. 2023 సెప్టెంబర్ 6న అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను గ్రామస్తులు ఒంటి చేతులపై ఎత్తుకుని వాగు దాటించడం అప్పట్లో బాహుబలి సినిమాను తలపించింది.
అనార్పల్లి వాగు దాటుతున్న ప్రజలు