
రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మందమర్రిరూరల్: మందమర్రి–బెల్లంపల్లి రైల్వేస్టేషన్ల మ ధ్య బుధవారం జరిగిన రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ తెలిపారు. హిస్సాన్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో గాయపడిన అతడిని బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని పేర్కొన్నారు. అతడి వయస్సు 40 నుంచి 45 మధ్య ఉంటుందని, వివరాలు తెలిసిన వారు 87126 58596 నంబరులో సంప్రదించాలని తెలిపారు.
పిడుగుపాటుకు గేదెల కాపరి..
నిర్మల్టౌన్: మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన సాకలి పోశెట్టి(52) పిడుగుపాటుకు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోశెట్టి గేదెలు కాస్తూ జీవనం సాగిస్తుంటాడు. మంగళవారం మంజులాపూర్ పెద్దచెరువు సమీపంలో గేదెలు మోపుతున్నాడు. సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా.. బుధవారం నీటిమడుగులో విగత జీవిగా కనిపించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఆస్పత్రికి వెళ్లివస్తూ అనంతలోకాలకు..
ఉట్నూర్రూరల్: కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రికి వెళ్లివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఉట్నూర్ మండలంలోని శంకర్ నాయక్ తండాకు చెందిన జాదవ్ బలిరాం(73)మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో బైక్పై హస్నాపూర్ తీసుకెళ్లాడు. తిరుగుప్రయాణంలో గ్రామ సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు రిమ్స్కు రెఫర్ చేశారు. పరీక్షించిన వైద్యులు హైదరాబాద్కు రెఫర్ చేశారు. తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
గడ్డెన్నవాగు కాలువలోపడి ఒకరు మృతి
లోకేశ్వరం: మండలంలోని పుస్పూర్ గ్రామ సమీపంలో ఉన్న గడ్డెన్నవాగు ప్రాజెక్టు కాలువలోపడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. బిహార్లోని ముధపర్నగర్కు చెందిన వినోద్ సహాని (35) ఉపాధి నిమిత్తం జిల్లాకు వచ్చి మండలంలోని రాజేశ్తండా సమీపంలోని రైస్మిల్లులో హమాలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ముఖఃదం గులాబ్ సహానితో కలిసి పుస్పూర్లో మద్యం సేవించాడు. ఇంటికి వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు పుస్పూర్ గ్రామ శివారులోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు కాలువలో పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని పెదనాన్న కుమారుడైన రాజ్గిర్ సహాని ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
మృతదేహానికి రీ పోస్టుమార్టం
ఇచ్చోడ: మండలంలోని బావోజిపేట్లో విద్యుత్ ఉచ్చుకు బలైన మండాడి రంబు మృతదేహానికి బుధవారం రీపోస్టుమార్టం నిర్వహించినట్లు సీఐ బండారి రాజు తెలిపారు. ఆదిలాబాద్లోని రిమ్స్కు చెందిన ముగ్గురు వైద్యులు, స్థానిక ఇన్చార్జి తహసీల్దార్ జాదవ్ రమేశ్ సమక్షంలో పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసి రీపోస్టుమార్టం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం మృతదేహాన్ని పూడ్చి వేశామని, ఘటనకు బాధ్యుడైన చిక్రం పాండు ఫరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు.

రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి