
తిరుగుబాటు
నిరంకుశంపై
చీల విఠల్
(ఫైల్)
చీల శంకర్
(ఫైల్)
దండనాయకుల గోపాల్ కిషన్రావు(ఫైల్)
ఏకబిల్వం
నాగేంద్రయ్య(ఫైల్)
బోనగిరి
వెంకటేశం(ఫైల్)
చిలుకూరి సీతారాం(ఫైల్)
తాటిపెల్లి
తిరుపతి(ఫైల్)
మహారాష్ట్రలో సాయుధ శిక్షణ
ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన బోనగిరి వెంకటే శం, తాటిపెల్లి తిరుపతి, చీల శంకర్, చీల విఠల్, ఏకబిల్వం నాగేంద్రయ్య, ఖాడ్రే శంకర్, రాంసింగ్, రేవయ్య, తాటిపల్లి తిరుపతి, ఏకబిల్వం శంకరయ్య, చందావార్ విఠల్, చిలుకూరి సీతారాం, జగన్నాథ్తో పాటు అనేక మంది యోధులు అజ్ఞాతంలోకి వెళ్లి మహారాష్ట్రలోని చాందా సాయుధ శిక్షణ శిబిరంలో ఏడాది పాటు శిక్షణ పొందారు. వీరికి ఆసిఫాబాద్కు చెందిన రాంచందర్ రావు పైకాజీ, సుబ్బబాబురావు, దండనాయకుల గోపాల్ కిషన్రావు, వామన్రావు వైరాగరే, ప్రభాకర్రావు మసాదే సహకరించారు. నిజాంకు వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు 1948 ఏప్రిల్ 21న వామన్రావును జైలులో పెట్టారు. న్యాయవాది పైకాజీ సమరయోధులకు మానసిక ధైర్యం, ఆర్థిక సహకారాన్ని అందించడంతో ఆయనపై హత్యాయత్నం కూడా జరిగింది. చాందా క్యాంపులో శిక్షణ పొందుతున్న సమయంలోనే ఆసిఫాబాద్కు చెందిన నాయకులు విరూర్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటనలో పాలుపంచుకున్నారు. ఈ ఘటనలో బోనగిరి వెంకటేశం కాలికి గ్రేనేడ్ తగలగా, ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
ఇండియన్ ఆర్మీతో కలిసి..
హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేసేందుకు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లబాయ్పటేల్ 1948 సెప్టెంబర్ 13న పోలీస్ యాక్షన్ ప్రకటించారు. మహారాష్ట్ర నుంచి సైనిక బలగాలు పది యుద్ధ ట్యాంకులు, పది ట్రక్కులు, 20 ఠానే గాఢ్లు, వందలాది మంది సైనికులతో ఆసిఫాబాద్ మీదుగా హైదరాబాద్ వైపు కదిలాయి. సెప్టెంబర్ 13న చంద్రాపూర్, బల్లార్షా, దాభా(ఉప క్యాంపు) సిరొంచ క్యాంపుల నుంచి సాయుధ సమరయోధులు భారత సైన్యం బాటలో రజాకార్లపై చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించకుండా రాజురా సమీపంలోని రైల్వే వంతెనకు రజాకార్లు బాంబులు అమర్చారు. అయితే 14న రాత్రి 11 గంటలకు రైల్వే వంతెన పేల్చివేత ప్రయత్నాలను సమరయోధులు గుర్తించారు. అదేరాత్రి 12 గంటలకు ఈ విషయాన్ని కొరియర్ వ్యవస్థ ద్వారా మిలటరీకి తెలియజేశారు. 2 గంటల ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ దాడి చేసి రజాకార్లను మట్టుబెట్టింది. బాంబులను సైతం తొలగించారు. తెల్లవారుజాము 3 గంటలకు విరూర్ రైల్వే స్టేషన్పై ఆసిఫాబాద్కు చెందిన బోనగిరి వెంకటేశం, మరో ఆరుగురు దాడి చేశారు. ఈ ఘటనలో కొందరికి బుల్లెట్ గాయాలయ్యాయి. పోలీసులు కొందరు చనిపోగా, మరికొందరు లొంగిపోయారు. 15న తెల్లవారుజామున 4 గంటలకు దాబా మీదుగా వచ్చిన మరో మిలటరీ క్యాంపు, సాయుధ పోరాట వీరులు పెన్గంగ సరిహద్దులోని లోనవెల్లి నాకాపై దాడి చేశారు. అదేరోజు రాత్రి 10 గంటలకు ఆసిఫాబాద్ సమీపంలోని బుజల్ఘాట్ వంతెనను రజాకార్లు పేల్చివేశారు. కానీ మరుసటిరోజు స్థానికులు ఇక్కడ తాత్కాలిక మార్గం ఏర్పాటు చేశారు. 16న అర్ధరాత్రి దాటిన తర్వాత సిరొంచ నుంచి వచ్చిన సైన్యం, సమరయోధులు బెజ్జూర్ ఔట్పోస్టుపై దాడి చేసి స్వాధీనపరుచుకున్నారు. తెల్లవారుజామున దహెగాం సమీపంలో పెసరకుంట వద్ద రజాకార్లపై దాడి చేశారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. అనంతరం బీబ్రా పోలీస్ స్టేషన్ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇదే రోజు స్వాతంత్య్ర సమరయోధులను ఆసిఫాబాద్ జిల్లా జైలులో పెట్టారు. 17న లొంగిపోతున్నట్లు నిజాం రాజు ప్రకటించడంతోపాటు జైలులోని వారు ఇతర ఖైదీలతో కలిసి బయటకు వచ్చారు. పోరాటంలో పాలుపంచుకున్న జిల్లాకు చెందిన అనేక మంది నాయకులను ప్రభుత్వం స్వాతంత్య్ర సమర యోధులుగా ప్రకటించింది.

తిరుగుబాటు

తిరుగుబాటు

తిరుగుబాటు

తిరుగుబాటు

తిరుగుబాటు

తిరుగుబాటు

తిరుగుబాటు