తిరుమలాయపాలెం: సమస్యల పరిష్కారం కోసం వీఓఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమలాయపాలెం దీక్షా శిబిరంలో బచ్చోడుకు చెందిన వీఓఏ పోలిశెట్టి అరుణ ఎండ తీవ్రతకు తోడు ఆహారం, నీరు తీసుకోకపోవడంతో స్పృహ కోల్పోయింది. దీంతో సహచరులు ఆమెను సీహెచ్సీకి తరలించి చికిత్స చేయించారు. కాగా, మండుటెండలో దీక్ష కొనసాగిస్తున్నా కనీస వేతనం అమలు, ఉద్యోగ భద్రత, పెండింగ్ బకాయిల చెల్లింపు, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని పేర్కొన్నారు. కాగా, చికిత్స పొందుతున్న అరుణను నాయకులు మందడి ఇజ్రాయిల్, సీపీఎం మండల కార్యదర్శి శ్రీను తదితరులు పరామర్శించారు.
భార్యను తీవ్రంగా
కొట్టిన భర్త
చికిత్స పొందుతూ మృతి
ఇల్లెందు: మద్యం మత్తులో భార్యను భర్త తీవ్రంగా కొట్టడంతో ఆమె మూడు రోజుల అనంతరం మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం పట్టణంలో చోటుచేసుకుంది. 15వ నంబర్ బస్తీకి చెందిన రాకేశ్లోద్ తన భార్య సుమలోద్ను ఈ నెల 21న తీవ్రంగా కొట్టాడు. దీంతో సుమలోద్ కుటుంబ సభ్యులు వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. 24న తెల్లారుజామున 5 గంటల సమయంలో సుమలోద్ నిద్రలేవపోవడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, తన చెల్లి సుమలోధ్ను బావ రాకేశ్లోధ్ తీవ్రంగా కొట్టడం వల్లే మృతి చెందినదని సోదరుడు రిషికాంత్లోద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సీఐ టి.సురేశ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
సూపర్బజార్ (కొత్తగూడెం): రామవరం వనందాస్గడ్డకు చెందిన ఆటోడ్రైవర్ చెన్నుమల్ల నాగేశ్వరరావు (53) ఆనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం ఇంటి పక్కన చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నాగేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు డబ్బులు లేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి అన్న వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేయగా టూటౌన్ ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేశారు.


