రఘునాథపాలెం: వర్షాలు మొదలైతే పొలాల్లో యంత్రాలు తిరగడానికి ఇబ్బంది ఎదురుకానున్నందున ఆలోపే పైప్లైన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖ సీఈ మంగళపూడి వెంకటేశ్వర్లు ఆదేశించారు. రఘునాథపాలెం మండలం పాపటపల్లి ప్రాంతంలో కొనసాగుతున్న మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పైప్లైన్ పొడిగింపు పనులను శనివారం ఆయన పరిశీలించారు. సాగర్ ప్రధాన కాల్వపై మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మొదటి దశ పనులు ఇప్పటికే పూర్తికాగా, రూ.40 కోట్లతో మరో 35 చెరువులకు నీరు అందించేలా పైప్లైన్ పొడిగింపు పనులు చేపడుతున్నారు. ఈ పనులను పరిశీలించిన సీఈ మాట్లాడుతూ.. గ్రావిటీ ద్వారా చెరువులకు సాగర్ నీరు తరలించేలా పైప్లైన్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. సీఈ వెంట ఈఈ అనన్య, డీఈ ఝాన్సీ, ఏఈలు తదితరులు ఉన్నారు. కాగా, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, సొసైటీ చైర్మన్ తాత రఘురాం, నాయకులు కేలోతు దేవ్సింగ్, బానోత్ కోటేశ్నాయక్, తేజావత్ వెంకన్న, రామయ్య, రామారావు, రవీందర్ పనులపై సీఈతో చర్చించారు.


