తిరుమలాయపాలెం: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. తన భార్యను శారీరకంగానే కాక మానసికంగా హింసిస్తుండడంతో తట్టుకోలేక ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గోల్తండాకు చెందిన గుగులోత్ భారతి – రంగా పెద్దకుమార్తె మీనాక్షి (35) వివాహం పదిహేనేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన బానోతు శివాజీతో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా, శివాజీ విద్యుత్శాఖలో కాంట్రాక్టు పనులు చేస్తూ ఏడాదిగా ఖమ్మంలో ఉంటున్నాడు. అక్కడ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆయన మీనాక్షిని చిత్రహింసలకు గురిచేస్తున్నాడని తెలిసింది. గురువారం రాత్రి కూడా గొడవ జరగగా మీనాక్షి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లి ఆరోపించింది. అల్లుడు శివాజీ, ఆయనతో సంబంధం కలిగిన మహిళతో పాటు ఆయన తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ కె.జగదీశ్ తెలిపారు. కాగా, బీమా డబ్బుల కోసమే మీనాక్షిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ కాంట్రాక్ట్ పనులకు ఉపయోగించే ట్రాక్టర్, ఇతర యంత్రాలను మీనాక్షి పేరిట కొనుగోలు చేసి బీమా చేయించినట్లు సమాచారం. ఈ క్రమాన బీమా ప్రయోజనాల కోసం శివాజీ హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇటీవల మీనాక్షిని చిత్రహింసలకు గురిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భర్త వేధింపులే కారణమని తల్లి ఆరోపణ


