తక్కువ వయస్సు ఉన్న వారిలో
పోటీపై ఆవేదన
ఎక్కువ వయస్సు గల వారిలో
మాత్రం హర్షం
ఖమ్మం సహకారనగర్/ఇల్లెందు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలకు 34ఏళ్లుగా వయో పరిమితిని తాజాగా 44ఏళ్లకు పెంచారు. ఈ నిర్ణయంపై 34ఏళ్ల వయస్సును సమీపాన ఉన్న వారిలో హర్షం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు కష్టపడినా ఉద్యోగాలు దక్కించుకోలేకపోయిన తమకు మరిన్ని అవకాశాలు దక్కుతాయనే భావనతో ఉన్నారు. ఇక కొత్తగా డిగ్రీ, పీజీలు పూర్తిచేసిన వారు మాత్రం తమకు పోటీ పెరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఒక్కో ఉద్యోగానికి వందలు, వేల సంఖ్యలో పోటీ ఉండగా వయో పరిమితి పెంపుతో ఇది మరింత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఒక్కో ఉద్యోగానికి వందల, వేల మంది పోటీ పడుతున్నారు. వయోపరిమితి పెంపుతో పోటీ పెరుగుతుంది. ఫలితంగా యువతకు అవకాశాలు దెబ్బతింటాయనే ఆందోళన ఉంది. ఈ అంశంపై ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.
– భట్టు నవ్య, ఖమ్మం
ఉద్యోగ వయో పరిమితిని 44ఏళ్లకు పెంచడం యువతలో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత పోటీ నేపథ్యాన ఈ నిర్ణయం యువత భవిష్యత్ను దెబ్బతీసేలా ఉంది. ప్రభుత్వం పునఃసమీక్షించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం.
– వంగూరి వెంకటేష్,
పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఖమ్మం
ఉద్యోగాల వయోపరిమితి పెంపుపై భిన్నాభిప్రాయాలు


