ఖమ్మం సహకారనగర్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యాన ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే అమలుచేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశం ఆదివారం ఖమ్మంలో జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చావా రవి మాట్లాడుతూ 2024 మార్చి నుంచి రిటైర్ అయిన సుమారు 12వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిల కోసం ఏక మొత్తంగా రూ.10వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, జీపీఎఫ్, సీపీఎస్ ఉపాధ్యాయుల డీఏ బకాయిలు విడుదల చేయడంతో పాటు నాలుగు డీఏలను ప్రకటించాలని, హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్యం అందే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యాన దశలవారీ పోరాటం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్.దుర్గాభవాని మాట్లాడుతూ ఆర్థిక భారం లేని సమస్యల పరిష్కారం, టెట్ అర్హత మార్కులు తగ్గింపుపైనా పట్టింపు లేనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ అమలు, కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే, మోడల్ స్కూళ్లు, గురుకులాల ఉద్యోగులకు హెల్త్ కార్డులు అమలుపై తీర్మానాలు ఆమోదించారు. తొలుత జ్యోతిరావు పూలే చిత్రపటం వద్ద నివాళులర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బుర్రి వెంకన్న, షేక్ యూసుఫ్ సైదా, కోశాధికారి వి.రాంబాబు, నర్సయ్య, నాగేశ్వరరావు, ఉద్దండ, సురేష్, రామకృష్ణ, కోటేశ్వరరావు, విజయ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి


