ఖమ్మంరూరల్: స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు సాగర్ కాల్వలోకి దిగిన పదో తరగతి విద్యార్థి గల్లంతయ్యాడు. ఏదులాపురానికి చెందిన ఆటోడ్రైవర్ పుట్టబంతి నాగయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడైన రామకృష్ణ (16) ఏదులాపురం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతూ వార్షిక పరీక్షలు రాస్తున్నాడు. మరో పరీక్ష రాస్తే పదో తరగతి పూర్తికానుంది. శుక్రవారం స్నేహితుడి పుట్టినరోజు కావడంతో ఐదుగురితో కలిసి సరదాగా మద్దులపల్లి వద్ద సాగర్ కాల్వలో ఈత కొడుతున్నారు. ఈతరాని రామకృష్ణ కొద్దిగా లోతు ప్రాంతంలోకి వెళ్లగా కాల్వలో మునిగిపోయాడు. ఆయన వెంట ఉన్న స్నేహితులకు కూడా ఈత రాకపోవడంతో కాపాడలేకపోయారు. ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చేపట్టారు.


