మధిర: మండలంలోని మాటూరుపేట క్రాస్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. చిరు వ్యాపారంతో జీవనం సాగించే నాగవరప్పాడు గ్రామానికి చెందిన తోకా వెంకయ్య (55) ద్విచక్ర వాహనంపై మధిర వెళ్తున్నాడు. ఈ క్రమంలో తాపీ పనిచేసే ఎర్రుపాలెం మండలం మొలుగుమాడుకు చెందిన తనిగంటి కోటేశ్వరరావు ద్విచక్ర వాహనంపై మధిరకు వెళ్తూ.. వెంకయ్య బైక్ను ఢీకొట్టాడు. వెంకయ్య తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కోటేశ్వరరావుకు కూడా తీవ్రగాయాలు కాగా మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు మధిర రూరల్ పోలీసులు తెలిపారు.
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య
మధిర: అప్పులు తీర్చే మార్గం లేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎర్రుపాలెం మండలం రాజులదేవరపాడుకు చెందిన లక్కిరెడ్డి గురవారెడ్డి (55) తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. పలు గ్రామాల్లో కొన్నేళ్లుగా పనిచేసి వచ్చాక ఐదేళ్ల నుంచి స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఇటీవల అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురై ఆయన మధిర మండలం దెందుకూరు సాగర్ కాలువ ఒడ్డున మర్రిచెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై మధిర రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వైద్యుడిపై దాడి
రఘునాథపాలెం: మండలంలోని మంచుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కాశయ్యపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. మాస్క్ ధరించి వచ్చిన సదరు వ్యక్తి వైద్యుడిపై దాడి చేసి పరారయ్యాడు. వైద్యుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఉస్మాన్ ఫరీఫ్ తెలిపారు.


