మరమ్మతులతో ఫలితం లేక..
● పెద్దాస్పతిలోని టీ హబ్లో నిలిచిన రోగ నిర్ధారణ టెస్టులు ● యంత్రాలకు కాలం చెల్లడంతో రెండు రోజులుగా బంద్ ● ఇతర ఆస్పత్రుల నుంచి శాంపిళ్ల సేకరణకు సైతం బ్రేక్
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలోని తెలంగాణ డయోగ్నస్టిక్ హబ్లో పరీక్షలు పూర్తిగా నిలిచిపోయాయి. తరచుగా యంత్రాలు మొరాయించడం, రసాయనాల సరఫరాలతో అవాంతరాలతో పరీక్షలు ఆగిపోవడం ఇక్కడ సర్వసాధారమే అయినా ప్రస్తుతం యంత్రాల కాలం చెల్లడంతో రెండు రోజులుగా టెస్టులు పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి శాంపిళ్లు కూడా పంపించడం లేదు.
57నుంచి 134 పరీక్షలకు...
పేద ప్రజలకు ఉచితంగా 57 రకాల పరీక్షలు చేసేందుకు గత ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లను నెలకొల్పింది. క్లినికల్ పాథాలజీ, మైక్రోబయాలజీ, క్లినికల్ బయో కెమిస్ట్రీకి చెందిన 57 రకాల పరీక్షలు నిర్వహించగా, దశల వారీగా పరీక్షల సంఖ్య 134కు చేరింది. పెద్దాస్పత్రికి వచ్చేవారే కాక జిల్లాలోని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పట్టణ దవాఖానాలు, ఏరియా ఆస్పత్రుల నుంచి నిత్యం 2 వేలకు పైగా శాంపిళ్లు వచ్చేవి. ఇక్కడ పరీక్షలు చేశాక నేరుగా రోగి సెల్కు రిపోర్టు పంపిస్తే వైద్యులకు చూపించి చికిత్స చేయించుకునేవారు. అయితే, ఖమ్మం ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన సెంటర్ ద్వారా కొద్దినెలల పాటు సక్రమంగానే పరీక్షలు జరిగినా, ఇటీవల రసాయనాల కొరత, యంత్రాల లోపాలతో తరచూ అవాంతరాలు ఎదురయ్యాయి. ఇప్పుడు యంత్రాలు పూర్తిగా మూలనపడటంతో పరీక్షలన్నీ నిలిపివేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చే వారిలో కొందరు ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. మరికొందరు పేదలు నిరాశగా వెనుతిరుగుతున్నారు.
లక్షలాది మందికి సేవలు
పెద్దాస్పత్రిలోని డయాగ్నస్టిక్ హబ్ ద్వారా ఇప్పటి వరకు లక్షలాది మందికి సేవలు అందాయి. 2021లో హబ్లో డయోగ్నస్టిక్ సేవలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 6,92,681 మంది నుంచి 12,74,564 శాంపిళ్లు సేకరించగా, 25,89,677 పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు కొత్త యంత్రాలు వస్తే తప్ప సెంటర్ తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో అప్పటి వరకు రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురుకానుంది.
ఆస్పత్రిలోని హబ్లో పరీక్షలు నిలిచిపోయిన విషయం వాస్తవమే. హబ్లోని యంత్రాల పరిస్థితిని కలెక్టర్కు నివేదించాము. కొత్త యంత్రాల అవసరాన్ని ప్రతిపాదించాము. కలెక్టర్ చొరవతో త్వరలోనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
– డాక్టర్ రాంబాబు, ఆస్పత్రి ఇన్చార్జ్ మెడికల్ సూపరింటెండెంట్
డయాగ్నస్టిక్ హబ్లో గంటకు 1,520 పరీక్షల సామర్ధ్యంతో యంత్రాలు ఉన్నాయి. ఇందులో కెమిస్ట్రీ ఎనలైజర్ మిషన్ ద్వారా 1,200 పరీక్షలు, ఇమ్యూనో ఎనలైజర్ మిషన్ ద్వారా 220, సీబీపీ మిషన్ ద్వారా వంద మందికి ఒకేసారి పరీక్షలు జరిగేవి. అయితే సీబీపీ మిషన్ మిషన్ మినహా కెమిస్ట్రీ ఎనలైజర్, ఇమ్యూనో ఎనలైజర్ యంత్రాలు పూర్తిగా మూలనపడ్డాయి. వీటి కాలం తీరడంతో తరచూ మొరాయిస్తుండగా ఇంజనీర్లను పిలిపించి తాత్కాలికంగా మరమ్మతులు చేయిస్తే కొద్దిరోజులే పనిచేసేవి. ప్రస్తుతం కీలకమైన ఈ యంత్రాలు మరమ్మతు చేయడానికి కూడా వీల్లేకుండా పాడయ్యాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.


