ఇందిరమ్మ ఇళ్లలో
వేగం పెరిగేలా పర్యవేక్షణ
గుడిసెలను గుర్తించేందుకుప్రత్యేక సర్వే
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మంగాంధీచౌక్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగం జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో ఇళ్ల నిర్మాణంపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 16,495 గృహాలు మంజూరైనందున 99 రోజుల కార్యాచరణలో దృష్టి సారించి త్వరగా పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. పలు మండలాల్లో అధికారుల సరైన దృష్టి పెట్టకపోవడంతో పురోగతి నమోదు కావడం లేదన్నారు. ప్రజావాణిలో కూడా గృహాలపై ఎక్కువ సంఖ్యలో వినతులు వస్తున్నాయని, ఇసుక సమస్య పరిష్కారమైందని వేగం పెరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం 2వేల ఇళ్లు పూర్తయ్యాయని, మరో 9,217 ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నందున ఇవి నెలాఖరులోగా పూర్తయ్యేలా చూసి మొత్తంగా 10 వేల గృహ ప్రవేశాలు జరగడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అలాగే, నిర్మాణం మొదలుకాని లబ్ధిదారులతో మాట్లాడి రుణాలను మంజూరు చేయించాలని చెప్పారు. ఈ అంశాలపై 10, 17, 24, 30వ తేదీల్లో సమీక్షిస్తామని తెలిపారు.
తప్పులు దొర్లితే చర్యలు
గుడిసెల రహితంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించినందున జిల్లాలో గుడిసెల గుర్తింపునకు సర్వే చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సర్వే తర్వాత మండలాల వారీగా థర్డ్ పార్టీతో ఆడిట్ చేయిస్తామని, ఎక్కడైనా తప్పులు దొర్లినట్లు తేలితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈమేరకు గ్రామపంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు సరైన సమాచారం సేకరించి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలన్నారు. గుడిసెల గుర్తింపు తర్వాత మొదటి దశలో నిర్మించని ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని సూచించారు. ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్ పాల్గొన్నారు.


