ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సోమవారం మిర్చి పోటెత్తింది. గడిచిన గురువారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో సోమవారం భారీగా సరుకు వచ్చింది. జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ, ఏపీలోని ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు దాదాపు 45 వేల బస్తాల మిర్చి విక్రయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మిర్చి విక్రయాలతో పాటు ధరలోనూ పురోగతి నమోదై మునుపటి కన్నా జెండా పాట ఎక్కువగా పలికింది. ఈనెల 2వ తేదీన తేజా రకం జెండాపాట క్వింటాకు రూ.19,450 పలకగా, సోమవారం రూ.19,500కు చేరింది. అలాగే, మోడల్ ధర రూ. 18వేలుగా నమోదైంది. అలాగే, తాలు మిర్చికి గరిష్టంగా రూ.10 వేలు, మోడల్ ధర రూ.8,200గా పలికింది. కొనుగోళ్లను మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు.
‘తేజా’ రకం క్వింటాకు రూ.19,500


