ఖమ్మం సహకారనగర్: వచ్చే విద్యాసంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6వ తరగతికి ప్రవేశాలు కల్పించడంతో పాటు 7 నుంచి 10వ తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 19న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డీఈఓ చైతన్యజైనీ తెలిపారు. ఆరో తరగతి పరీక్ష ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుండి 10వ తరగతుల పరీక్ష మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని వెల్లడించారు. కారేపల్లి మోడల్ స్కూల్, జెడ్పీహెచ్ఎస్, టేకులపల్లి మోడల్ స్కూళ్లలో కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కాగా, ప్రశ్నాపత్రం లీకేజీపై ఎవరైనా ప్రచారం చేస్తే తల్లిదండ్రులు నమ్మొద్దని, అలాంటి సమాచారాన్ని కలెక్టర్, సీపీ లేదా తమకు తెలియచేయాలని డీఈఓ ఓ ప్రకటనలో కోరారు.
మార్కెట్ల రిటైర్డ్ ఉద్యోగుల కార్యవర్గం ఎన్నిక
ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ మార్కెట్ కమిటీల విశ్రాంత ఉద్యోగుల ఉమ్మడి జిల్లా కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఖమ్మం మార్కెట్లో టి.విశ్వనాథం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమస్యలపై చర్చించాక నూతన కమిటీని ప్రకటించారు. గౌరవ సలహాదారుగా ఆమంచి కోటయ్య, గౌరవ అధ్యక్షుడిగా టి.విశ్వనాథం, అధ్యక్షుడిగా జల్లా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా శ్రీపాద నిరంజన్, కోశాధికారిగా సీహెచ్.నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా డి.ఉప్పలయ్య, బి.సుధాకర్, రెంటాల చిన్నహుస్సేన్, పరిటాల సత్యనారాయణ, మూర్తి, సంయుక్త కార్యదర్శులుగా ఎం.ఆంజనేయులు, ఎం.కేశవరావు, కె.సురేందర్రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ఎం.అరుణ్కుమార్, పి.వెంకయ్య, డి వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరరావు, ఆర్.రెడ్డి, బాబులాల్, ఉదయలక్ష్మి, శర్మ, సారంగపాణిని ఎన్నుకోగా, ఆర్సీహెచ్.హుస్సేన్ రాసిన శిశిర సింధూరం గేయ సంపుటిని ఆవిష్కరించారు.


