ఖమ్మంరూరల్: వివాహిత సెల్కు మెసేజ్లు పంపిస్తున్నాడని ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడుకు చెందిన ఆమె భర్త.. అదే గ్రామానికి చెందిన సంపెట శివపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వీరిద్దరు తల్లంపాడులోని ఓ సైట్కు ట్రాక్టర్లో మట్టి తరలిస్తున్నారు. ఈక్రమాన సదరు వ్యక్తి గురువారం సైట్ వద్ద తన భార్యకు ఎందుకు మెసేజ్లు పంపిస్తున్నావని శివతో గొడవ పడ్డాడు. ఆపై బైక్పై ఆరేకోడు తండా శివారుకు తీసుకెళ్లి కత్తితో దాడి చేయగా గొంతు, చెవి, చేతులకు బలమైన గాయాలయ్యాయి. దీంతో దాడి నుంచి తప్పించుకున్న శివ తన సోదరుడికి ఫోన్లో చెప్పగా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తల్లి ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
అంతులేని దుఃఖంలోనూ అవయవదానం
● ప్రైవేట్ ఉద్యోగి కుటుంబీకుల ఔదార్యం
ఖమ్మంమామిళ్లగూడెం: భర్త తనను వీడి వెళ్లిపోయాడనే దుఃఖంలోనూ ఓ మహిళ ఆయన అవయవాల దానంతో ఇంకొందరికి ప్రాణదాతగా మారింది. తల్లాడ మండలం కలకొడిమకు చెందిన రైతు పాపినేని నాగేశ్వరరావు కుటుంబం ఖమ్మంలో నివాసం ఉంటోంది. ప్రస్తుతం మొక్కజొన్న విత్తన కంపెనీలో పనిచేస్తున్న ఆయన భార్య అనంతలక్ష్మి డిజిటల్ మీడియాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించినా ఫలితం లేకపోగా బ్రెయిన్ డెడ్గా వైద్యులు నిర్ధారించారు. దీంతో వైద్యుల సూచనతో తన భర్త అవయవాలను దానం చేసిన అనంతలక్ష్మి మరికొందరికి ప్రాణదాతగా నిలిచారు. కాగా, నాగేశ్వరరావుకు భార్యతో పాటు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు.


